తాను ముంబై ఇండియన్స్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్ను పొందలేదని హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ తెలిపాడు. తాను 2022లో ముంబై జట్టులో చేరా అని, అప్పటి నుంచి తాము ట్రోఫీని గెలవలేదన్నాడు. వ్యక్తిగతంగా గత మూడు సీజన్లు బాగానే సాగాయని, జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు మాత్రం రాలేదన్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయర్లకు మద్దతుగా ఉంటాడని, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడని తిలక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో తిలక్ వర్మ 8 మ్యాచ్ల్లో 231 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తాజాగా తిలక్ వర్మ మాట్లాడుతూ… ‘నేను 2022లో ముంబై ఇండియన్స్లో చేరా. అప్పటి నుంచి మా టీమ్ టైటిల్ గెలవలేదు. అందుకే నేను ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్ను పొందలేదు. ఈ విషయాన్ని రోహిత్, సూర్యా భాయ్లకు ఎప్పుడూ చెబుతుంటా. వ్యక్తిగతంగా నాకు గత మూడు సీజన్లు బాగానే సాగాయి కానీ.. జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు రాలేదు. ఈ సంవత్సరం అందరం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. టైటిల్ గెలవడానికి ప్రయత్నిస్తాం. హార్దిక్ భాయ్తో నాకు మంచి అనుబంధం ఉంది. టీ20 అరంగేట్రంలో హార్దిక్ చేతుల మీదుగానే ఇండియా క్యాప్ అందుకున్నా. చాలా ప్రత్యేకమైన అనుభవం అది. గతేడాది నుంచి హార్దిక్ కెప్టెన్సీలో ఆడుతున్నా. ప్లేయర్లకు ఎప్పుడే మద్దతుగా ఉంటాడు, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడు’ అని తెలిపాడు.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?
‘సూర్యకుమార్ యాదవ్ మన చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చేస్తాడు. వికెట్ల మధ్య పరుగెత్తుతున్నప్పుడు మా మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అతని ముఖంలో అస్సలు ఆందోళన కనిపించదు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో 19వ ఓవర్ వేసినప్పుడు కూడా నెట్స్లో బౌలింగ్ చేసినట్లు నాకు అనిపించింది. బుమ్రా భాయ్ అద్భుతం’ అని తిలక్ వర్మ కొనియాడాడు. 2022లో ముంబై జట్టులో చేరిన తిలక్.. తక్కువ కాలంలో కీలక ఆటగాడిగా మారాడు. ప్రతి సీజన్లో రాణిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు.