ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అడపాదడపా మెరుపులు తప్పితే.. నిలకడగా రాణించలేదు. ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున కూడా పెద్దగా రాణించిన దాఖలు లేవు. దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్ను బెంగళూరు వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టుకు ఎంపిక కాని ఈ హైదరాబాద్ పేసర్.. ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఉప్పల్ మైదానంలో ఆదివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం రాకపోవడం, ప్రస్తుత ప్రదర్శనపై స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేనందుకు మనస్థాపానికి గురయ్యా అని, ఒక దశలో ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయా అని, ఆపై తీవ్రంగా కష్టపడ్డాను అని తెలిపాడు. ‘ఉప్పల్ మైదానంలో చాలా మ్యాచ్లు ఆడాను. సొంత మైదానంలో ఆటడం చాలా స్పెషల్. ఆ అనుభూతి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేక్షకుల్లో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్లు సంతోషంగా ఉంటారు. ఏడేళ్ల పాటు బెంగళూరుకు ఆడాను, ఇప్పుడు గుజరాత్కు ఆడుతున్నా. నా బౌలింగ్పై తీవ్రంగా శ్రమించా. అది నాకు చాలా మేలు చేసింది’ అని సిరాజ్ చెప్పాడు.
Also Read: MS Dhoni: ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్లతో మళ్లీ ఆడాలనుంది: ధోనీ
‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఎంపిక కాలేనందుకు మనస్థాపానికి గురయ్యా. ఒక దశలో ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయా. దానిని దృష్టిలో పెట్టుకుని చాలా కష్టపడ్డాను. గతంలో నేను ఏం తప్పులు చేశానో తెలుసుకుని సరిదిద్దుకున్నా. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. నా బౌలింగ్ను ఆస్వాదిస్తున్నా. భారత జట్టులో ఛాన్స్ రాకపోయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నా. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో ఆడేందుకు సిద్ధమయ్యాను. అనుకున్నవిధంగా మైదానంలో ఆట తీరును అమలు చేస్తే.. వికెట్లు అవే వస్తాయి. వికెట్కు ఇరు వైపులా స్వింగ్ చేస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది’ అని మహ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు.