NTV Telugu Site icon

Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మంత్రి కారు స్టిక్కర్ వాడింది అతనే!

Rave Party

Rave Party

Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో మంత్రి వాహనంపై సీసీబీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేవ్ పార్టీ సమయంలో మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి మంత్రి కారు స్టిక్కర్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో ఫామ్ హౌస్ నుంచి పూర్ణారెడ్డి పారిపోయారు. పూర్ణారెడ్డిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Arogyasri: ఏపీలో తిరిగి ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఏ2 అరుణ్‌ కుమార్, ఏ4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. చిత్తూరు వాసి రణధీర్ డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. తవణంపల్లి మండలం మడవనేరికి చెందిన అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో జీఆర్‌ ఫామ్‌హౌస్‌ యజమాని గోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. గోపాల్ రెడ్డి విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గోపాల్ రెడ్డి ఏ6 గా ఉన్నారు.