International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!

Yoga Day

Yoga Day

International Yoga Day 2026: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) 2026 జూన్ 21, ఆదివారంతో 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది నిర్వహించే వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. కోల్‌కతాలోని ప్రసిద్ధ ‘రెడ్ రోడ్’ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ యోగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతిపాదించిన ఒక ఆలోచన.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందించే ఒక అంతర్జాతీయ ఉద్యమంగా ఎలా రూపాంతరం చెందిందో ఈ వేడుకలే నిదర్శనం. ఈ సందర్భంగా యోగా దినోత్సవం, చరిత్ర గురించి తెలుసుకుందాం..

అసలు “యోగా” అనే పదం సంస్కృత మూలాలైన “యుజ్”, “యుజిర్” నుంచి ఉద్భవించింది. దీని అర్థం కలపడం లేదా ఏకం చేయడం అని అర్థం. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేయడంతో పాటు.. మానవాళికి, ప్రకృతికి మధ్య సామరస్యాన్ని పెంపొందించడాన్ని యోగా సూచిస్తుంది. మారుతున్న కాలంతో పాటు మారుతున్న జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది (2026) అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing) అనే ప్రత్యేక థీమ్‌ను నిర్ణయించారు.

×
×
Ad

ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎలా ప్రారంభమైంది?

యోగ సాధనకు ప్రపంచ గుర్తింపు తేవాలనే ఆలోచనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (UNGA) ప్రసంగంలో మొదటిసారిగా ప్రతిపాదించారు. యోగాను భారతదేశ ప్రాచీన సంప్రదాయం అందించిన అమూల్యమైన కానుకగా అభివర్ణించిన మోడీ, మనసు-శరీరం, ఆలోచన-ఆచరణల మధ్య సమతుల్యతను సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రపంచ దేశాలకు వివరించారు. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ సమాజం నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఫలితంగా, 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తూ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఈ తీర్మానానికి రికార్డు స్థాయిలో 177 సభ్య దేశాలు సహ-అనుసరణ (co-sponsor) చేయడం విశేషం. ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే అతి తక్కువ కాలంలో అంటే కేవలం 90 రోజుల్లోనే ఆమోదం పొందిన తీర్మానాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

చారిత్రాత్మక మొదటి యోగా దినోత్సవం

తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక ఈవెంట్‌లో 84 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మొత్తం 35,985 మంది పాల్గొన్నారు. ఒకే వేదికపై ఇంతమంది పాల్గొనడం అప్పట్లో ఒక రికార్డ్. ఈ కార్యక్రమం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది. అందులో ఒకటి.. ప్రపంచంలోనే అతిపెద్ద యోగా క్లాస్‌గా నిలవడం కాగా, రెండోది.. ఒకే యోగా సెషన్‌లో అత్యధిక దేశాల ప్రజలు పాల్గొనడం. ఈ విజయంతో ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకునే సంప్రదాయం మొదలైంది.

జూన్ 21నే ఎందుకు ఎంచుకున్నారు?

యోగా దినోత్సవానికి జూన్ 21ని ఎంచుకోవడం వెనుక బలమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ఈ రోజు ఉత్తరార్ధగోళంలో అత్యంత సుదీర్ఘమైన పగలు కలిగిన రోజైన ‘సమ్మర్ సోల్‌స్టిస్’ (వేసవి కాల గరిష్ఠ పగటి కాలం) ఏర్పడుతుంది. అనేక సంస్కృతులు, ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని కాంతి, శక్తి, నూతన ఉత్తేజం, సమతుల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఇవి యోగా తత్వశాస్త్రానికి అత్యంత దగ్గరగా ఉండే విలువలు. భారతీయ సంప్రదాయాల ప్రకారం, ఈ రోజు తర్వాత ‘దక్షిణాయనం’ ప్రారంభమవుతుంది. ఈ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనలకు, ఆత్మపరిశీలనకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు. అంతేకాదు, యోగ సంప్రదాయం ప్రకారం.. ఆదియోగి అయిన శివుడు తన శిష్యులకు (సప్తఋషులకు) యోగ విజ్ఞానాన్ని బోధించడం ప్రారంభించింది కూడా ఈ కాలంలోనేనని నమ్ముతారు.

యోగా దినోత్సవ ముఖ్య ఉద్దేశం.. ప్రయోజనాలు:

ఈ దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం.. యోగా వల్ల కలిగే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వారిని రోజువారీ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకునేలా ప్రోత్సహించడం. దాదాపు 5,000 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రాచీన చరిత్ర కలిగిన ఈ భారతీయ విద్య.. కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇందులో శారీరక ఆసనాలు, శ్వాస ప్రక్రియలు (ప్రాణాయామం), ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ (ఏకాగ్రత) కలిసి ఉంటాయి. నిత్యం యోగా సాధన చేయడం వల్ల శరీరంలో సరళత (flexibility), బలం పెరుగుతాయి. శరీర భంగిమ (posture), సమతుల్యత మెరుగవుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, ఏకాగ్రతను, మానసిక స్పష్టతను పెంపొందించడంలో యోగా అద్భుతంగా పనిచేస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఒక సంజీవని లాంటిది.