International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్‌.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!

Flight

Flight

International flights cancelled: విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్‌ ఇచ్చాయి. విజయవాడ, విశాఖపట్నం, శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, చెన్నై ఎయిర్‌పోర్ట్‌ సహా తదితర విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణానికి నాలుగు నుంచి ఐదు రోజుల ముందే విమానాల రద్దు సమాచారం అందుతుండటంతో ముందస్తుగా ప్లాన్‌ చేసుకున్న కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే బుక్‌ చేసుకున్న టికెట్లలో దాదాపు 95 శాతం వరకు క్యాన్సిలేషన్‌ మెసేజ్‌లు వస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తున్నప్పటికీ, ముందుగానే వేసుకున్న ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా అస్తవ్యస్తమవుతున్నాయి.

ఇక కొత్తగా టికెట్లు బుక్‌ చేయాలంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో రూ.70 వేల వరకు ఉన్న టికెట్‌ ధరలు ఇప్పుడు వన్‌వే ప్రయాణానికే రూ.2 లక్షల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిన ధరలను చూసి చాలామంది కుటుంబాలు తమ విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా విజయవాడ–షార్జా విమాన సర్వీసు రద్దవడంతో గల్ఫ్‌ కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. షార్జా మార్గంగా అమెరికా, యూరప్‌ వెళ్లాలని భావించిన వారి ప్రణాళికలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌ నుంచి కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు.

ఈ పరిస్థితికి పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలే ప్రధాన కారణమని విమానయాన వర్గాలు చెబుతున్నాయి. ఏవియేషన్‌ ఫ్యూయల్‌ ధరలు భారీగా పెరగడంతో పాత టికెట్‌ ధరలకే సర్వీసులు నడపడం సంస్థలకు భారంగా మారిందని సమాచారం. నష్టాలు తగ్గించుకునేందుకు ఎయిర్‌లైన్స్‌ కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వేసవి సెలవులు, కుటుంబ కార్యక్రమాలు, విదేశాల్లో ఉన్న పిల్లల వద్దకు వెళ్లాలనుకున్నవారికి ఈ పరిణామాలు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకున్నా కూడా భరోసా లేకపోవడంతో వందలాది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. విమానం ఎక్కకముందే ప్రయాణికులకు భారీ ఝలక్‌ తగిలిన పరిస్థితి కనిపిస్తోంది.