భారతీయ రైల్వే చరిత్రలో ఒక విప్లవాత్మక అడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ప్రయాణీకుల రైలు హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య నడవడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుకు ‘నమో గ్రీన్ రైల్’ అని పేరు పెట్టారు. దీని నిర్వహణ బాధ్యతలను ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్ చూసుకుంటుంది.
ఆదివారం నుంచి ఈ రైలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ అత్యాధునిక రైలును తయారు చేసింది. ఈ రైలుకు 74010, 74009 నంబర్లను కేటాయించారు. జింద్ నుంచి సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హైడ్రోజన్ రైలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. డీజిల్ రైళ్లతో పోలిస్తే ఇది కాలుష్యాన్ని పూర్తిగా నివారిస్తుంది, కాబట్టి దీనిని భవిష్యత్తు సాంకేతికతగా పిలుస్తున్నారు.
ఈ రైలు వారంలో ఏడు రోజులూ అందుబాటులో ఉంటుంది. రైలు నంబర్ 74010 ఉదయం 7:40 గంటలకు జింద్ జంక్షన్ నుంచి బయలుదేరి, ఉదయం 9:40 గంటలకు సోనిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 74009 ఉదయం 10:40 గంటలకు సోనిపట్ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 1:00 గంటలకు జింద్ చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో రైలు మొత్తం 14 స్టేషన్ల గుండా వెళ్తూ 12 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో జింద్ సిటీ, పాండు పిండారా, లలిత్ ఖేడ హాట్, భంబేవా, ఈషాపూర్ ఖేడి హాట్, బుటానా హాట్, ఖండారి హాట్, గోహానా, రాభ్రా హాట్, లాత్ హాట్, మోహానా హర్యానా, బర్వాస్ని హాట్ ఉన్నాయి. దీనివల్ల హర్యానాలోని అనేక చిన్న పట్టణాలు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది.
ఇంతటి అత్యాధునిక సాంకేతికత కలిగిన రైలు అయినప్పటికీ, సామాన్యులకు భారం కాకుండా రైల్వే శాఖ దీని ధరలను సాధారణ డీజిల్ మల్టిపుల్ యూనిట్ రైళ్లతో సమానంగా ఉంచింది. ప్రయాణికులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కనీస టికెట్ ధర 10 రూపాయలుగా ఉండగా, జింద్ నుంచి సోనిపట్ వరకు పూర్తి ప్రయాణానికి గరిష్ట ధర కేవలం 25 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో.. దేశంలోని ఇతర మార్గాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం కానుంది, ఇది భారతదేశ స్వచ్ఛ ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

