Shubhanshu: “అందరికీ నమస్కారం” అంటూ అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి మెసేజ్..

Shubhanshu Shukla

Shubhanshu Shukla

అంతరిక్షం నుంచి వ్యోమగామి శుభాంశు శుక్లా తొలి సందేశం పంపారు. దేశ ప్రజలకు అంతరిక్షం నుంచి నమస్కారం తెలిపారు.

రోదసీలో ఎలా నడవాలి, ఎలా తినాలనేది శిశువులా నేర్చుకుంటున్నట్లు చెప్పారు. భారతదేశ అంతరిక్ష రంగంలో ఇది స్థిరమైన, దృఢమైన అడుగు అని పేర్కొన్నారు.

ఐఎస్‌ఎస్‌లో సమయం గడపడానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అక్కడి అనుభవాలను పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు శుభాంశు శుక్లా వివరించారు.

“అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది. ఇదో గొప్ప ప్రయాణంగా భావిస్తున్నాను. 30 రోజుల క్వారంటైన్‌ తర్వాత ఐఎస్‌ఎస్‌ కు చేరుకోబోతున్నాం. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. మాతో పాటు ఈ రైడ్‌కు జాయ్‌ కూడా వచ్చింది.” అని శుభాంశు శుక్ల వెల్లడించారు.

‘‘స్పేస్‌లో పరిస్థితులకు ఇప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను.. నా భూజంపై త్రివర్ణ పతాకం ఉంది. అంటే.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన నాకు కలుగుతోంది. రోదసియానంలో నాది చిన్న అడుగే కావొచ్చు. కానీ, భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు.” అని శుభాంశు వ్యాఖ్యానించారు.

నేను నా సిబ్బందితో నవ్వుతూ, జోక్ చేశానని, కొన్ని యోగా భంగిమలను ప్రయత్నించానని ఆయన అన్నారు. శుభాన్షు గోడలపై తేలుతూ, హ్యాండిల్స్ పట్టుకుని పని చేస్తున్నానని చెప్పారు.

ఆయన మరికొన్ని గంటల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోనున్నారు. ప్రస్తుతం భూకక్ష్యలో వ్యోమనౌకలో తిరుగుతున్నారు.