Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం

Women's Asia Cup Final 2026

Women's Asia Cup Final 2026

Women’s Asia Cup Final 2026: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడినా.. టెస్ట్‌లు గెలిచినా.. ఆ దేశానికి చెందినవారు వివిధ హోదాల్లో ఉన్నా.. వారి నుంచి ట్రోఫీ అందుకోవడానికి నిరాకరిస్తూనే ఉంది.. టీమిండియా.. అది పురుషుల జట్టు అయినా సరే.. మహిళల జట్టు అయినా సరే.. పాక్‌కు చెందినవారికి నిరాశ తప్పడం లేదు.. తాజాగా, మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించిన భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే టైటిల్ గెలిచిన ఆనందం కంటే.. ట్రోఫీ ప్రదానోత్సవం జరిగిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ ప్రభుత్వ మంత్రి మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది.

ట్రోఫీ ఇవ్వకుండానే ముగిసిన ప్రదానోత్సవం
అయితే, భారత జట్టు కఠిన వైఖరి కారణంగా ట్రోఫీ ప్రదానోత్సవం పూర్తికాకుండానే ముగిసింది. నఖ్వీ ముందుగా రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్టుకు అవార్డును అందజేశారు. అనంతరం రన్నరప్ చెక్కును శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టుకు అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నఖ్వీ వేదిక నుంచి వెళ్లిపోయారు. అయితే విజేతగా నిలిచిన భారత జట్టుకు మాత్రం ట్రోఫీ అందలేదు. ఈ పరిణామంపై భారత మహిళల జట్టు కోచ్ అమోల్ ముజుందార్ స్పందిస్తూ.. తాము బీసీసీఐ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. టోర్నమెంట్ ముగిసిందని, తాము ఛాంపియన్లమని, అదే తమకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

మ్యాచ్ సమయంలో నఖ్వీపై కెమెరాల ఫోకస్
ఫైనల్ మ్యాచ్ చివరి దశలో భారత్ విజయం దిశగా సాగుతున్న సమయంలో మోసిన్ నఖ్వీ ఇతర ప్రముఖులతో కలిసి స్టాండ్స్‌లో కూర్చున్న దృశ్యాలు కెమెరాల్లో కనిపించాయి. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేబాజిత్ సైకియాలకు సమీపంలోనే నఖ్వీ కూర్చున్నారు. అయితే, మ్యాచ్ ముగిసిన అనంతరం నఖ్వీ వేదికపైకి వచ్చారు. శ్రీలంక జట్టుకు రన్నరప్ అవార్డు, చెక్కును అందజేశారు. శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు, పర్వేజ్ మహారూఫ్‌తో మాట్లాడిన అనంతరం ప్రదానోత్సవ కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత నఖ్వీ మైదానం నుంచి నిష్క్రమించారు.

నఖ్వీకి బీసీసీఐ రెండు ఆప్షన్లు
నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు భారత జట్టు తొలుతనే అభ్యంతరం వ్యక్తం చేసిందని బీసీసీఐ కార్యదర్శి దేబాజిత్ సైకియా వెల్లడించారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం నఖ్వీకి బీసీసీఐ రెండు ప్రత్యామ్నాయాలను సూచించినట్లు ఆయన తెలిపారు. మొదటి ప్రతిపాదన ప్రకారం.. ఏసీసీ ఉపాధ్యక్షుడు ఖాలిద్ అల్ జరూనీ భారత జట్టుకు ట్రోఫీని అందజేయాలి. రెండో ప్రతిపాదనగా.. ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం విజేత బోర్డు ప్రతినిధి తమ జట్టుకు ట్రోఫీని అందజేయాలని సూచించారు. అయితే ఈ రెండు ప్రతిపాదనలను నఖ్వీ తిరస్కరించినట్లు సైకియా తెలిపారు. తానే ట్రోఫీని అందజేస్తానని నఖ్వీ పట్టుబట్టగా.. భారత జట్టు కూడా తన నిర్ణయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో విజేత జట్టుకు ట్రోఫీ అందకుండానే ప్రదానోత్సవం ముగిసింది.

2025 పురుషుల ఆసియా కప్‌లోనూ ఇదే వివాదం
మహిళల ఆసియా కప్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామం 2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌ను గుర్తు చేసింది. ఆ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత భారత జట్టు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ట్రోఫీని ఏసీసీ ఉపాధ్యక్షుడు, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రతినిధి చేతుల మీదుగా అందించాలని భారత్ కోరింది. అయితే ఆ ప్రతిపాదనను నఖ్వీ తిరస్కరించడంతో వివాదం తలెత్తింది. దీంతో 2025లో ఏసీసీ అధికారులు ట్రోఫీ, పతకాలతో మైదానం నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో భారత క్రీడాకారిణులు కూడా వేదికపైకి పిలుపు కోసం గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. ఆ ఘటన తర్వాత కూడా భారత జట్టు ఏసీసీ నుంచి ఆ ట్రోఫీని అందుకోలేదు.

నఖ్వీ వైఖరిలో మార్పు లేదు
2025లో జరిగిన ఘటన తర్వాత మోసిన్ నఖ్వీ తన వైఖరిపై దృఢంగా ఉన్నారు. విజేత జట్టు కెప్టెన్ తన చేతుల మీదుగానే ట్రోఫీని స్వీకరించాలనే అభిప్రాయాన్ని ఆయన కొనసాగించారు. దీంతో తాజాగా మహిళల ఆసియా కప్ ఫైనల్‌లోనూ ఇదే అంశంపై మరోసారి ప్రతిష్టంభన ఏర్పడింది. ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ.. ప్రధాన అంశం మాత్రం అదే. భారత జట్టు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించగా, నఖ్వీ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించకపోవడంతో విజేతలకు ట్రోఫీ ప్రదానం జరగలేదు. మొత్తంగా భారత మహిళల జట్టు మాత్రం శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్ టైటిల్‌ను ఘనంగా సొంతం చేసుకుంది. అయితే విజేతలకు ట్రోఫీ అందకుండానే ప్రదానోత్సవం ముగియడం ఈ ఫైనల్‌కు ప్రత్యేక చర్చకు దారితీసింది.