భారత క్రికెట్ జట్టు జూలై 23 నుండి జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సరికొత్త జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మతో పాటు స్పిన్నర్ హర్ష్ దూబే మొదటిసారి భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యారు.
అయితే.. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి, 55 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన యశ్ ఠాకూర్ ఎంపికపై టీమిండియా సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలెక్టర్లు మళ్లీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని విహారి అభిప్రాయపడ్డారు.
కేవలం యశ్ ఠాకూర్ మాత్రమే కాకుండా.. ఫాస్ట్ బౌలర్ మయంక్ యాదవ్ ఎంపికను కూడా విహారి తప్పుబట్టారు. గతంలో 156.7 కిమీ వేగంతో బౌలింగ్ చేసిన మయంక్ యాదవ్, ఐపీఎల్ 19వ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదని, పైగా అతను తరచూ గాయాల బారిన పడుతుంటాడని గుర్తుచేశారు. ప్రస్తుతం అతను 150 కిమీ వేగంతో కూడా బౌలింగ్ చేయడం లేదని, ఐపీఎల్లో కనీసం ప్లేయింగ్ ఎలెవన్లో లేని ఆటగాళ్లను భారత జట్టులోకి ఎలా ఎంపిక చేస్తారని విహారి ప్రశ్నించారు.
దీనిపై బిసిసిఐ వర్గాలు స్పందిస్తూ… మయంక్ యాదవ్, అశోక్ శర్మలు దేశంలోనే అత్యంత వేగవంతమైన యువ బౌలర్లని, జింబాబ్వే లాంటి జట్లపై కాకపోతే మరి ఎక్కడ వారిని పరీక్షిస్తామని సమర్థించుకున్నాయి. అలాగే ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించిన ప్రభ్సిమ్రన్ సింగ్ను సంజూ శాంసన్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్న ఆరుగురు ఆటగాళ్లలో శాంసన్ ఒకరిగా ఉన్నందున అతడిని ఎంపిక చేయలేదని తెలుస్తోంది.
జింబాబ్వే టీ20 సిరీస్ కోసం భారత స్క్వాడ్..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాంశ్ శెడ్గే, రింకూ సింగ్, మయంక్ యాదవ్, ప్రభ్సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ.

