ఇండియా, ఐర్లాండ్ మధ్య జరగబోయే రెండు మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ సమయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జూన్ 26 (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లు, నిర్ణీత సమయం కంటే ఒక గంట ముందే ప్రారంభం కానున్నట్లు క్రికెట్ ఐర్లాండ్ ప్రకటించింది. ఐర్లాండ్ లోకల్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్లు, ఇప్పుడు మధ్యాహ్నం 1:30 గంటలకే మొదలవుతాయి. దీనివల్ల భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్లు, సాయంత్రం 6:00 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సాయంత్రం 5:30 గంటలకే టాస్ వేయనున్నారు. భారత పురుషుల జట్టు మ్యాచ్ సాయంత్రం 6 గంటలకే ప్రారంభం కావడం చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి.
ఈ సమయ మార్పునకు ప్రధాన కారణం ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లే. అదే రోజు సాయంత్రం భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ఇండియా, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ రెండు ముఖ్యమైన మ్యాచ్లు ఒకే సమయంలో రావడం వల్ల ప్రేక్షకులు విడిపోయే అవకాశం ఉంది. ఈ క్లాష్ లేదా ఓవర్లాప్ను నివారించడానికి, బ్రాడ్కాస్టర్లతో చర్చించిన తర్వాతే క్రికెట్ ఐర్లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత మీడియా భాగస్వామి అయిన ‘సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్’ కూడా వ్యూవర్షిప్ తగ్గకుండా ఉండేందుకు ఈ మార్పునకు అంగీకరించింది.
ఐర్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత, భారత జట్టు జూలై 1 నుండి ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇంగ్లాండ్తో జరిగే రెండు మరియు ఐదో టీ20 మ్యాచ్లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి, కాగా ఒకటి, మూడు, నాలుగో మ్యాచ్లు రాత్రి 10:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఇంగ్లాండ్ సిరీస్ ప్రసార హక్కులను టీవీలో సోనీ స్పోర్ట్స్, డిజిటల్ స్ట్రీమింగ్లో జియోస్టార్ దక్కించుకున్నాయి.

