భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో సంజూ శాంసన్ స్థానంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2026 టీ-20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన శాంసన్ను తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇద్దరూ ఎడమచేతి వాటం (లెఫ్ట్ హ్యాండర్స్) బ్యాటర్లు. భారత టాప్-7 బ్యాటింగ్ లైనప్లో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లే ఉండటం వ్యూహాత్మకంగా సరైనది కాదని కైఫ్ అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఎడమచేతి వాటం ఓపెనర్లు ఉంటే ప్రత్యర్థి జట్టు ఆఫ్ స్పిన్నర్లను ఉపయోగించి సులభంగా ఒత్తిడి పెంచగలదు. రెండో టీ-20లో పార్ట్-టైమ్ ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో వైభవ్ స్టంప్ అవుట్ అవ్వడమే దీనికి ఉదాహరణ. గతంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా ఇదే సమస్య వల్ల పెద్ద భాగస్వామ్యాలు నమోదు కాలేదని ఆయన గుర్తుచేశారు. ఇది రాబోయే టీమిండియా మ్యాచ్లకు పెద్ద ప్రమాదం అని హెచ్చరించారు.
సంజూ శాంసన్ జట్టులోకి తిరిగి రావడం అత్యంత అవసరమని కైఫ్ స్పష్టం చేశారు. వైభవ్ లేదా అభిషేక్ లలో ఒకరు నంబర్ 3 స్థానానికి మారి.. ఓపెనింగ్లో ఒక కుడిచేతి వాటం బ్యాటర్ను ఆడించాలని సూచించారు. శాంసన్ ఒత్తిడిని అధిగమించి ‘బౌన్స్ బ్యాక్’ అయ్యే ఆటగాడని ఆయన కొనియాడారు.
చివరగా.. వైభవ్ సూర్యవంశీ ప్రతిభను కైఫ్ స్వాగతించినప్పటికీ, శాంసన్ వంటి సీనియర్ ఫామ్ ఉన్న ఆటగాడిని పక్కనబెట్టి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లతో ఓపెనింగ్ చేయడం భారత జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

