India vs England: నేడు సెమీస్ సమరానికి ముంబైలోని వాంఖడే స్టేడియం సిద్ధమైంది. భారత్ vs ఇంగ్లాండ్ జట్లు మధ్య భీకర పోరును వీక్షించేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్ల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఓ వైపు ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్లో ఓడిపోకుండా దూసుకుపోతుంది. మరోవైపు.. సౌతాఫ్రికా చేతిలో ఓడిన భారత్ అత్యంత వేగంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టు ఈ మ్యాచ్ను ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్ సేన ఇప్పటికే అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. అయితే.. ఈ రెండు జట్లలో ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ప్రధాన ఆయుధాలుగా మారనున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే భారత జట్టుకు కీలక బౌలర్గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు మొత్తం 93 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 116 వికెట్లు సాధించాడు. బౌలింగ్ నియంత్రణ అద్భుతంగా ఉంది. ప్రతి ఓవరుకు సగటున కేవలం 6.53 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కష్టమైన సమయంలో వికెట్లు తీయడంలో బుమ్రా ఎంతో నిపుణుడు.
అర్షదీప్ సింగ్ సైతం ఈ ఫార్మాట్లో ప్రపంచంలోని మంచి వేగ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటివరకు 82 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. అందులో 126 వికెట్లు తీసుకున్నాడు. ప్రతి ఓవరుకు సగటు 8.47గా ఉంది. చివరి ఓవర్లలోనూ ధైర్యంగా బౌలింగ్ చేయగలగడం అర్షదీప్ ప్రత్యేకత. ఇక ఇంగ్లాండ్ జట్టును పరిశీలిస్తే.. జోఫ్రా ఆర్చర్ ఫాస్ట్ బౌలింగ్ ఇరగ దీస్తున్నాడు. ప్రపంచ క్రికెట్లో వేగానికి పేరుగాంచిన బౌలర్గా నిలిచాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున 44 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన ఆర్చర్ 56 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ సగటు ప్రతి ఓవరుకు 8.14 పరుగులు. మరోవైపు.. సామ్ కరన్ సైతం ఫాస్ట్ బౌలింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడు ఇప్పటివరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. అందులో 66 వికెట్లు తీసుకున్నాడు. అతడి బౌలింగ్ సగటు ప్రతి ఓవరుకు 8.64 పరుగులు. ఈ గణాంకాలను చూస్తే రెండు జట్ల ఫాస్ట్ బౌలర్ల విభాగం అత్యంత బలంగా ఉంది. అందుకే ఈ అర్ధ ఫైనల్ పోరు మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది.
