Ind vs Eng Playing XI: భారత్–ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో నేడు (జూలై 9) బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో, మూడో టీ20ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో భారత్కు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. బ్రిస్టల్లో గెలిస్తే సిరీస్ను 2-2తో సమం చేసే ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటివరకు 33 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 18 విజయాలు సాధించగా, ఇంగ్లాండ్ 14 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
మూడో టీ20లో నాటింగ్హామ్ వేదికగా టీమిండియా చరిత్రలోనే అత్యంత భారీ పరాజయాల్లో ఒకటిని చవిచూసింది. కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయిన భారత్పై ఇంగ్లాండ్ 125 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇదే పిచ్పై ఇంగ్లాండ్ 200కుపైగా పరుగులు చేయగా.. భారత బ్యాటర్లు పరిస్థితులకు అనుగుణంగా ఆడలేక పూర్తిగా విఫలమయ్యారు. భారత్ బ్యాటర్లు పరిస్థితులను అర్థం చేసుకోకుండా మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించడం జట్టుకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతులతో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ 7 వికెట్లు నేలకూల్చారు.
మూడో టీ20 అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. జట్టు పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోయిందని అంగీకరించారు. ఇంగ్లాండ్ పిచ్ లకు అనుగుణంగా ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని, కేవలం దూకుడు మాత్రమే విజయాన్ని అందించదని ఆయన పేర్కొన్నారు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడంలో భారత ఆటగాళ్లు మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు.
బ్యాటింగ్ మాత్రమే కాకుండా డెత్ ఓవర్లలో భారత బౌలర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. చివరి ఓవర్లలో భారీగా పరుగులు ఇవ్వడంతో ఇంగ్లాండ్ 200కు పైగా స్కోరు నమోదు చేసింది. బ్రిస్టల్ లో జరిగే నాలుగో టీ20లో బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ సమష్టిగా రాణిస్తేనే భారత్కు విజయావకాశాలు మెరుగుపడతాయి.
ప్లేయింగ్ XIలో మార్పులు.?
జట్టు కూర్పులో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేలవ ఫామ్ కారణంగా అతని స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం దక్కే అవకాశముంది. టీ20 ప్రపంచకప్-2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజూ.. తొలి మ్యాచ్ తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు అతడిని మళ్లీ జట్టులోకి తీసుకొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించే అవకాశముంది. సుందర్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ లోనూ రాణించగలడు.
మరోవైపు 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో నిర్భయంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్గా మార్చుకోలేకపోయాడు. అయినప్పటికీ అతనిపై జట్టు యాజమాన్యం నమ్మకం ఉంచినట్లు సమాచారం. బ్రిస్టల్ మ్యాచ్లో కూడా అతడు తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది.
భారత్ ప్లేయింగ్ XI (అంచనా):
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (WC), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (C), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI (అంచనా):
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (WC), హ్యారీ బ్రూక్ (C), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, విల్ జాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.

