IND vs AUS: మూడో టెస్టులో గట్టి పోటీ.. ఆధిక్యంలో ఆసీస్‌ జట్టు

Ind Vs Aus

Ind Vs Aus

IND vs AUS: బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియాకు మూడో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా గట్టి పోటీనిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా నిలిచింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఆటగాళ్లు పీటర్‌ హాండ్స్‌కాంబ్ (7), కామెరూన్‌ గ్రీన్‌ ( 6) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ ఆటగాళ్లలో ఉస్మాన్‌ ఖవాజా 60 పరుగులతో మెరిశాడు. లబుషేన్‌ 31 పరుగులు చేయగా.. స్టీవ్‌ స్మిత్ 26, ట్రావిస్‌ హెడ్ 9 పరుగులు చేశారు. ఈ నాలుగు వికెట్లు కూడా రవీంద్ర జడేజా పడగొట్టినవే కావడం గమనార్హం.

Read Also: ICC Rankings: టాప్ ర్యాంక్‌లోకి భారత బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఒక స్థానం ఎగబాకిన బుమ్రా

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ స్పిన్నర్ల ధాటికి 109 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌ ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్‌లో తమదే పైచేయి అన్నట్లుగా ఆడారు. భారత ఆటగాళ్లలో రోహిత్‌, గిల్‌ క్రీజులో ఉన్నంతవరకు వేగంగా పరుగులు రాబట్టారు. కానీ టీమిండియా భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా పరిస్థితి చేజారిపోయింది. వెంటవెంటనే టికెట్లు పడిపోవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కునెమన్‌ ఐదు వికెట్లు పడగొట్టగా.. లైయన్ మూడు, మార్ఫీ ఒక వికెట్ తీశారు.