భారత్ , అఫ్గానిస్తాన్ జట్ల మధ్య శనివారం జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున సిరాజ్ కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘమైన ఐపీఎల్ సీజన్ కారణంగా ఆయనపై పడిన పనిభారాన్ని మేనేజ్ చేసే క్రమంలో భాగంగానే అఫ్గానిస్తాన్తో జరిగే టెస్ట్ మ్యాచ్ నుండి సిరాజ్కు విశ్రాంతినిచ్చే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాబోయే 48 గంటల్లో ఒక స్పష్టమైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ సిరాజ్కు విశ్రాంతినిస్తే, ఆయన స్థానంలో జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీని భారత జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తూ మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలుచుకోవడంలో ఆకిబ్ నబీ అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. ఈ ప్రతిష్టాత్మక దేశీవాళీ టోర్నమెంట్లో ఆయన ఏకంగా 60 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించారు. అయితే.. ఆకిబ్ను కేవలం ఒక బ్యాకప్ లేదా నెట్ బౌలర్గా మాత్రమే జట్టుతో ఉంచడంపై టీమిండియా మాజీ పేసర్ ఇషాంత్ శర్మ చిన్ననాటి కోచ్ శ్రవణ్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రంజీ ట్రోఫీలో 60 వికెట్లు తీసి తన జట్టును ఛాంపియన్గా నిలబెట్టిన ఆటగాడిని కేవలం బ్యాకప్ ప్లేయర్ పేరుతో నెట్ బౌలర్గా పరిమితం చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బీసీసీఐ , జాతీయ సెలెక్టర్లు టెస్ట్ జట్టును ఎంపిక చేసేటప్పుడు రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను సరైన రీతిలో గుర్తించడం లేదని శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఒకవేళ దేశవాళీ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకోకపోతే రంజీ ట్రోఫీని నిర్వహించడమే వృథా అని, దానిని రద్దు చేయడం మంచిదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్తో జరిగేది కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కాబట్టి, అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఆకిబ్ నబీకి నేరుగా ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడే అవకాశం కల్పించాలని ఆయన సెలెక్టర్లను డిమాండ్ చేశారు. సిరాజ్ ఫిట్నెస్, లభ్యతపై స్పష్టత వస్తేనే ఆకిబ్ నబీకి భారత టెస్ట్ క్యాప్ దక్కుతుందా లేదా అనేది అధికారికంగా తేలనుంది.
