Team India: ఋతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం… రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..

Shubhman Gill

Shubhman Gill

భారత క్రికెట్ జట్టు తన తదుపరి పర్యటనలో భాగంగా ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో సారాంశ్ జైన్‌కు తొలిసారి అవకాశం దక్కగా, మిగిలిన జట్టులో పాత ముఖాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ జరగనున్నాయి. దీనికి ముందు ఆగస్టు 7 నుంచి భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

అయితే ఈ ఎంపికలో ఐదుగురు ప్రముఖ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేరు ఈ జాబితాలో లేకపోవడంతో ఆయన అంతర్జాతీయ కెరీర్ ముగిసిందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి జట్టుకు దూరంగా ఉన్న షమీ, రంజీల్లో రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్లు ఆయన వైపు మొగ్గు చూపలేదు. అలాగే రెడ్ బాల్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉన్న ఋతురాజ్ గైక్వాడ్, రజత్ పటీదార్‌లకు కూడా నిరాశే ఎదురైంది. రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ డార్‌ను ఎంపిక చేయలేదు. ఇక గతంలో ఫిట్‌నెస్ సాధించి బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్‌ను మళ్లీ పక్కన పెట్టారు.

సెలెక్టర్లు ప్రకటించిన ఈ టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారు. జట్టులో యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్ సభ్యులుగా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్ట్‌కు అందుబాటులో లేరని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రాలు తుది జట్టులో ఆడటం అనేది బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఇచ్చే ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటికే బుమ్రా ఫట్ నెస్ సాధించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. తుది జట్టులో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.