India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్‌నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

India Odi Squad

India Odi Squad

India ODI Squad vs England: ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, అతని ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న కోహ్లీ.. తుది ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే జట్టుతో కలవనున్నారు.

ఐపీఎల్ 2026 ఫైనల్లో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన కోహ్లీ, ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చివరి వన్డేలో అద్భుత శతకం బాదాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 86 బంతుల్లో అజేయంగా 110 పరుగులు చేసిన జైస్వాల్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ సిరీస్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతనికి చోటు దక్కలేదు.

×
×
Ad

మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత అతను ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఎంపికైనప్పటికీ వెన్నునొప్పి కారణంగా చివరి క్షణంలో తప్పుకున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా బుమ్రాను ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 పర్యటనలకు కూడా ఎంపిక చేయలేదు. ఆఫ్ఘనిస్థాన్‌పై 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా సెలెక్టర్లు ఇంగ్లండ్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

భారత్ వన్డే జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ*, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.