Site icon NTV Telugu

India AI Impact Summit 2026: న్యూఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో గందరగోళం.. వివాదంపై బీజేపీ రియాక్షన్..

India Ai Impact Summit

India Ai Impact Summit

India AI Impact Summit 2026: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తొలి రోజే భారీ గందరగోళానికి గురైంది. ఇది యువతలో ఉన్న అపార ఆసక్తి వల్లే జరిగిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ సమ్మిట్ ప్రధాని నరేంద్ర మోడీ టెక్నాలజీ విజన్‌లో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమ్మిట్ మొదటి రోజు భారీ క్యూలు, ప్రవేశ విధానంపై స్పష్టత లేకపోవడం, హాల్‌లలో గందరగోళం వంటి సమస్యలు ఎదురైనా.. నిర్వహణ బృందం ఇప్పటికే క్షమాపణ చెప్పిందని గుర్తుచేశారు. కానీ ఇంత పెద్ద సంఖ్యలో యువత ఏఐ భవిష్యత్తులో భాగస్వాములు కావాలనే ఉత్సాహంతో రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. చిన్న చిన్న నిర్వహణ లోపాలు ఉన్నా, ఈ కార్యక్రమాన్ని పెద్ద దృక్కోణంలో చూడాలని సూచించారు.

READ MORE: Ishan kishan: ICC ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్-10లో స్థానం..

భారత్ డిజిటల్ ప్రయాణాన్ని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెక్నాలజీ అనేది కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాదని, పాలన, ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవితాల్లో నమ్మకం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశం 1.4 బిలియన్ ప్రజలకు టెక్నాలజీ ద్వారా మార్పు తీసుకువచ్చిన దేశంగా ప్రపంచానికి చూపించిందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో జరిగే సమ్మిట్‌లతో పోలిస్తే ఈ కార్యక్రమానికి మూడు లక్షల మందికిపైగా హాజరు కావడం భారత డిజిటల్ భవిష్యత్తుపై ప్రజల ఆసక్తిని చూపుతోందన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొనేవారికి ఎదురైన ఇబ్బందులపై క్షమాపణ చెప్పారు. అందరి ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరిస్తున్నామని, సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నామని చెప్పారు.

READ MORE: T20 World Cup 2026: శ్రీలంక, జింబాబ్వే చేతిలో పరాజయం.. ఆస్ట్రేలియా పతనానికి అసలు కారణాలు ఇవే?

అయితే మరోవైపు ఈ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ప్రవేశానికి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం, క్యూ ఆర్ కోడ్‌లు, పాస్‌ల విషయంలో గందరగోళం, మీడియాకు సరైన సదుపాయాలు లేకపోవడం వంటి అంశాలు ప్రతినిధులు ప్రస్తావించారు. హాల్‌లలో సరిపడా సీట్లు లేకపోవడం, దారిచూపే బోర్డులు లేకపోవడం అసంతృప్తికి కారణమయ్యాయి. మైత్రేయ వాఘ్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు గేట్లు మూసివేయడంతో తన స్టాల్‌కే వెళ్లలేకపోయానని సోషల్ మీడియాలో వాపోయాడు. మరో స్టార్టప్ అధినేత ధనంజయ్ యాదవ్ భద్రతా కారణాల పేరుతో బయటకు పంపించారని, తరువాత తమ పరికరాలు కనిపించలేదని ఆరోపించాడు. భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్న చోట ఇలా ఎలా జరిగిందని ప్రశ్నించాడు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా ఈ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. బయటకు మెరిసేలా కనిపించినా లోపల సరైన ప్రణాళిక లేదని, ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.

Exit mobile version