శ్రీలంకలోని గాలే వేదికగా జూన్ 25 నుంచి ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ ధ్రువ్ జురెల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత శతకంతో కదంతొక్కడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అయితే.. సాయి సుదర్శన్ 175 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి గుణశేఖర బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
అంతకుముందు ఓపెనర్ ఆయుష్ పాండే 25 పరుగుల వద్ద అవుట్ కావడంతో భారత్కు తొలి వికెట్ పడింది. ఆ తర్వాత లంచ్ విరామం అనంతరం వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో దేవదత్ పడిక్కల్ 12 పరుగులకే వెనుదిరిగాడు. నాలుగో స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కాసేపు ఇన్నింగ్స్ను నిలబెట్టినా, 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయి ప్రస్తుతం 259/4 స్కోరుతో కొనసాగుతోంది.
ఇటీవలే శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ను కైవసం చేసుకున్న ఇండియా ఏ జట్టు, ఇప్పుడు టెస్ట్ సిరీస్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆ ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగులు చేసి అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ టెస్ట్ సిరీస్లో భాగం కాలేదు. ప్రస్తుతం అతడు సీనియర్ భారత జట్టుతో కలిసి ఐర్లాండ్ పర్యటనలో ఉన్నాడు. జూన్ 26న జరిగే ఐర్లాండ్ మ్యాచ్లో అతడు గనుక అరంగేట్రం చేస్తే, భారత అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ సదుపాయం భారత్లో అందుబాటులో లేదు. కాబట్టి అభిమానులు కేవలం లైవ్ స్కోర్ అప్డేట్ల ద్వారానే మ్యాచ్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇండియా ఏ తుది జట్టులో సాయి సుదర్శన్, ఆయుష్ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆకిబ్ నబీ దార్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు చోటు దక్కింది. సీనియర్ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లకు ఈ టెస్ట్ సిరీస్ చాలా కీలకం కానుంది.

