IND vs WI: ముగిసిన తొలిరోజు ఆట.. డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి!

  • అరుణ్‌ జైట్లీ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ రెండో టెస్టు
  • ముగిసిన తొలిరోజు ఆట
  • 2 వికెట్ల న‌ష్టానికి 318 ప‌రుగుల చేసిన భారత్
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల న‌ష్టానికి 318 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (173; 253 బంతుల్లో 22 ఫోర్లు) భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు. య‌శ‌స్వితో పాటు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌ (20) క్రీజులో ఉన్నాడు. సాయి సుదర్శన్‌ (87) హాఫ్ సెంచరీ చేయగా.. కేఎల్‌ రాహుల్‌ (38) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్ జోమెల్‌ వారికన్ రెండు వికెట్స్ పడగొట్టాడు.

Also Read: AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు య‌శ‌స్వి జైస్వాల్‌ మంచి ఆరంభాన్నిచ్చాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (38) అతడికి సహకరించాడు. జట్టు స్కోర్ 58 వద్ద వారికన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం సాయి సుదర్శన్‌ కూడా బాగా ఆడాడు. జైస్వాల్‌ బౌండరీల మోత మోగించడంతో 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన సుదర్శన్‌ 87 రన్స్ వద్ద వారికన్‌ బౌలింగ్‌లోనే ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్‌, గిల్‌ ఉన్నారు. రెండోరోజు గిల్‌ కూడా రాణిస్తే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేస్తుంది. తొలి టెస్టులో విండీస్‌ ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.