IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!

  • మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ ఘన విజయం
  • పాకిస్థాన్‌పై 19-0తో ఏకపక్ష విజయం
  • ఈ విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
  • మ్యాచ్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే రెండు పెనాల్టీ కార్నర్లు..
Ind Vs Pak

Ind Vs Pak

IND vs Pak: మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ అదరగొట్టింది. పాకిస్థాన్‌పై ఏకపక్ష పోరులో ఏకంగా 19-0 తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జట్టు మ్యాచ్‌లోని ప్రతి విభాగంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

మ్యాచ్ ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లోనే భారత్ రెండు పెనాల్టీ కార్నర్లు సాధించింది. ఏడో నిమిషంలో పూజా సాహూ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. రెండు నిమిషాలకే రోష్ని ఐండ్ మరో గోల్‌ చేయడంతో ఆధిక్యం 2-0కు చేరింది. ఆ తర్వాత తను శ్రీ కడు, సుఖ్‌వీర్ కౌర్, సనికా మానే వరుసగా గోల్స్ చేయడంతో తొలి క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 5-0 ఆధిక్యంలో నిలిచింది.

రెండో క్వార్టర్‌లోనూ భారత జట్టు అదే జోరును కొనసాగించింది. మధు సిదార్, గీతా యాదవ్, సనికా మానే, తనూజా టోప్పో, పూజా మాలిక్ గోల్స్ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 10-0 ఆధిక్యంలోకి వెళ్లింది. విరామం తర్వాత కూడా భారత దాడులకు పాకిస్థాన్‌ వద్ద సమాధానం లేకపోయింది. మూడో క్వార్టర్‌లో పూర్ణిమ యాదవ్, మధు సిదార్, సుప్రియా గోల్స్ చేయడంతో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది.

చివరి క్వార్టర్‌లో కృష్ణ శర్మ, పూజా మాలిక్, సుప్రియా, బినిమా ధన్, రోష్ని గోల్స్ సాధించారు. పూజా మాలిక్ హ్యాట్రిక్ పూర్తి చేయగా, సుప్రియా రెండు గోల్స్ చేసింది. 60వ నిమిషంలో రోష్ని చేసిన గోల్‌తో భారత్ 19-0తో విజయాన్ని ఖరారు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 19 గోల్స్, 18 పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ సాధించింది. మరోవైపు పాకిస్థాన్ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోవడంతో పాటు ఒక్క పెనాల్టీ కార్నర్‌, పెనాల్టీ స్ట్రోక్‌ కూడా పొందలేదు.

ఈ ఘన విజయంతో భారత్ మహిళల జూనియర్ ఆసియా కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో కొరియా-మలేషియా క్వార్టర్‌ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. జూనియర్ ఆసియా కప్ టైటిల్‌పై కన్నేసిన భారత జట్టు.. ఇదే దూకుడును సెమీస్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది.