ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్పై చారిత్రక విజయానికి అందుకున్న భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీలే కాదు.. ఇంగ్లండ్కు చెందిన మాజీ క్రికెటర్ల నుంచి కూడా అభినందనలు రావడం గమనార్హం. రెండో టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియాను ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ప్రశంసించారు. ఇంగ్లండ్ బజ్బాల్ క్రికెట్కు మిగతా టీమ్స్ జంకుతాయేమో కానీ.. భారత్ మాత్రం భయపడదు అని పేర్కొన్నారు. శుభ్మన్ గిల్ అటు కెప్టెన్, ఇటు బ్యాటర్గానూ జట్టును ముందుండి నడిపించాడని వ్యాఖ్యానించారు.
ఐఏఎన్ఎస్తో మాంటీ పనేసర్ మాట్లాడుతూ… ‘ఈ విజయంతో టీమిండియాలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఇంగ్లండ్ బజ్బాల్కు భారత్ భయపడటం లేదని ఈ మ్యాచ్ ద్వారా తెలుస్తోంది. జట్టుపై మేనేజ్మెంట్ చాలా నమ్మకం ఉంది. శుభ్మన్ గిల్ అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించాడు. అలాగే బాగా బ్యాటింగ్ చేశాడు. ఎడ్జ్బాస్టన్లో టీమిండియాకు మొదటి టెస్ట్ విజయం ఇది. చరిత్రలో నిలిచిపోయే క్షణాలు ఇవి. ఇక లార్డ్స్లో మూడో టెస్టులో ఉత్సాహంతో ఆడుతుంది. సొంత గడ్డపై ఇంగ్లండ్ను భారత్ దెబ్బకొట్టింది. ఇక్కడ 20 వికెట్లు తీయడం పెద్ద విషయం. బౌలింగ్ కాంబినేషన్ చాలా బాగుంది. లార్డ్స్లో జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టుతో కలుస్తాడు. అప్పుడు భారత జట్టు బౌలింగ్ ఎటాక్ మరింత బలంగా మారుతుంది’ అని అన్నారు.
Also Read: Viral Video: బుసలు కొడుతున్న 18 అడుగుల కింగ్ కోబ్రా.. ఈజీగా పట్టేసిన లేడీ ఆఫీసర్!
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లలో కొత్త బంతితో 10 వికెట్లు తీసిన ఆకాష్ దీప్ను మాంటీ పనేసర్ ప్రశంసలతో ముంచెత్తారు. ‘కొత్త బంతితో ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు మంచి సగటును కలిగి ఉన్నాడు. అతడికి అద్భుతమైన పునరాగమనం. రానున్న టెస్టుల్లో కూడా రాణిస్తాడు’ అని పనేసర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 286 పరుగులు ఇవ్వడం ఆతిథ్య జట్టుకు ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. జూలై 10 నుంచి లార్డ్స్లో మూడవ టెస్ట్ ప్రారంభం అవుతుంది.