ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ దుమ్మురేపుతోంది. బ్యాటింగ్లో ఇరగదీసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 427/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం కలుపుకుని 608 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఇక ఆట చివరి రోజు భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్నది మ్యాచ్లో కీలకంగా మారింది. ఐదవ రోజు ఏడు వికెట్స్ తీస్తే.. మ్యాచ్ భారత్ సొంతమవుతుంది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
రెండో ఇన్నింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో వికెట్స్ వెనకాల ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్ హరీ బ్రూక్.. పంత్ను కవ్వించే ప్రయత్నం చేశాడు. టెస్ట్లలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు 55 బంతులు అని, ఈరోజు నువ్ ఆ రికార్డ్ అందుకోవాలని పంత్తో అన్నాడు. దీనికి పంత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘రికార్డులపై నాకు అంత అత్యాశ లేదు. నా ఆట నేను ఆడుతా. రికార్డ్లు వాటంతట అవే వస్తాయి’ అని బ్రూక్కు బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో స్టంప్ మైక్లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ 58 బంతుల్లో 65 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్లో 8 బౌండరీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి కీలకమైన 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సిరీస్లో పంత్ అదరగొడుతున్నాడు. మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు (134, 118) బాదాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 25 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 65 రన్స్ బాదాడు.