పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోగ్యం క్షీణించినట్లుగా గత కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ఖాన్ ఆరోగ్యంపై న్యాయస్థానం జోక్యం చేసుకుంది.
తాజాగా ఇమ్రాన్ఖాన్కు భారీ ఊరట లభించింది. జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ను ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తక్షణమే తరలించి వైద్య చికిత్స అందించాలని మంగళవారం ఆదేశించింది. వైద్య నిపుణుల సేవలు, తనకు నచ్చిన వైద్యుల ద్వారా చికిత్స అందించాలంటూ ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ వైద్య బోర్డు ఆయన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలించి చికిత్స అందించనుంది. ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా, ఆయన వ్యక్తిగత వైద్యుడు వైద్య పరీక్షలు, చికిత్స సమయంలో అక్కడ ఉండేందుకు కూడా కోర్టు అనుమతించింది.
ఇమ్రాన్ ఖాన్ వైద్య రికార్డులను సమర్పించాలని, ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును ఇమ్రాన్ ఖాన్ కుటుంబమే భరించాలని స్పష్టం చేసింది. అలాగే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో భద్రత, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
2023 నుంచి జైలులోనే..
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గత కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన 2023 ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల అడియాలా జైలు అధికారులు సమర్పించిన వైద్య నివేదిక ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి సమస్య చికిత్స అనంతరం మెరుగుపడిందని, ఆయన చూపు దాదాపు సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. అయితే ఈ నివేదికను ఇమ్రాన్ ఖాన్ పార్టీ తిరస్కరించింది. ఆయనకు తాము ఎంపిక చేసుకున్న వైద్యుల ద్వారా షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో పరీక్షలు, చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది.
ఆగస్టు 1, 2026న ఇమ్రాన్ ఖాన్కు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన మరో నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఆయన రక్తపోటులో హెచ్చుతగ్గులు, తలనొప్పి, ఆందోళన, గుండె దడ, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇస్లామాబాద్కు చెందిన కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ అక్తర్ అలీ బండిషా ఆయనను పరీక్షించారు. పరీక్ష సమయంలో ఇమ్రాన్ ఖాన్ రక్తపోటు 140/100 mmHgగా నమోదైంది. ఇదే వైద్యుడు ఫిబ్రవరి 2026లో పరీక్షించినప్పుడు ఆయన రక్తపోటు 120/80 mmHgగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఇక ఇమ్రాన్ ఖాన్ మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు వైద్యులు పలు సూచనలు చేశారు. భార్యతో ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని, చదువుకునేందుకు తగిన పుస్తకాలు అందించాలని సూచించారు. అలాగే గుండె పరిస్థితిని మరింత లోతుగా అంచనా వేసేందుకు CT Coronary Angiography పరీక్ష చేయాలని సిఫారసు చేశారు. అధిక రక్తపోటును నియంత్రించేందుకు మందుల మోతాదును కూడా పెంచారు. ఇందులో భాగంగా నార్వాస్క్ 5 మి.గ్రా. మందును ఉదయం రోజుకు ఒకసారి తీసుకోవాలని సూచించినట్లు వైద్య నివేదికలో ఉంది.
విభేదాలకు తెరపడేనా?
ఇమ్రాన్ ఖాన్కు జైలులో సరైన వైద్యం అందుతోందని అధికారులు చెబుతుండగా.. ఆయన కుటుంబ సభ్యులు, PTI మాత్రం స్వతంత్ర నిపుణుల ద్వారా చికిత్స అందించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జైలు వెలుపల ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్ షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలోనే ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్యంపై కొనసాగుతున్న వివాదంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

