దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నానికి భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
దేశ వ్యాప్తంగా వాతావరణం మారిందని.. దీంతో పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవగా.. గురువారం కూడా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. ధూళి తుఫానులు కూడా ఏర్పడతాయని.. దీంతో జనజీవనానికి అంతరాయం కలుగుతుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందుతారని పేర్కొంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ధూళి తుఫానులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే హర్యానా, పంజాబ్లో కూడా బలమైన గాలులతో పాటు ఆకస్మిక ధూళి తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. బలమైన గాలుల వల్ల చెట్లు కూలిపోయి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని వార్నింగ్ ఇచ్చింది. లోతట్టు ప్రాంతాలు వరదలకు గురికావచ్చని తెలిపింది.
రాబోయే కొద్ది రోజుల పాటు ఈశాన్య భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణ భారతదేశంలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని.. అనవసర ప్రయాణాలను మానుకోవాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.
