Site icon NTV Telugu

IAS Officer: గుంజీలు తీసిన ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా.. కారణం ఇదే..

Ias Officersss

Ias Officersss

యూపీ కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహి తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యవస్థలోని అవినీతిని ఎదిరించి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఒక నిజాయితీ గల అధికారికి పని చేసే అవకాశం ఇవ్వకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.

రాజీనామా వెనుక అసలు కారణం..

లక్నోలోని రెవెన్యూ బోర్డుకు బదిలీ అయిన తర్వాత తనకు ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించలేదని రింకూ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏ పనీ చేయకుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం కూడా ఒక రకమైన అవినీతే’ అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రజాసేవ చేసే అవకాశం లేకుండా, కేవలం ‘అటాచ్డ్’ పోస్టింగ్‌తో ఖాళీగా కూర్చోబెట్టడం తన నైతిక విలువలకే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

గుంజీల ఘటన..

గత ఏడాది జూలైలో షాజహాన్‌పూర్‌లో ఎస్‌డీఎంగా ఉన్నప్పుడు ఒక వింత ఘటన జరిగింది. కార్యాలయ ప్రాంగణంలో మరుగుదొడ్ల దుస్థితిపై నిరసన తెలుపుతున్న న్యాయవాదుల వద్దకు వెళ్లిన ఆయన, అక్కడి అసౌకర్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ అందరి ముందూ ఐదు గుంజీలు తీశారు. అంతకుముందు బహిరంగ మూత్ర విసర్జన చేసిన ఒక వ్యక్తితో కూడా ఆయన గుంజీలు తీయించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం ఆయనను తక్షణమే బదిలీ చేసింది.

మృత్యుంజయ పోరాటం..

రింకూ సింగ్ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 2008లో సాంఘిక సంక్షేమ అధికారిగా ఉన్నప్పుడు భారీ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఏడు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. దీనివల్ల ఒక కంటి చూపు పోయి, ముఖం వికృతంగా మారినా ఆయన వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత కఠిన శ్రమతో యూపీఎస్సీ సాధించి ఐఏఎస్ అయ్యారు. అవినీతిపై పోరాడి బుల్లెట్లను సైతం ఎదుర్కొన్న అధికారికి, చివరకు వ్యవస్థలో పని చేసే స్వేచ్ఛ లేకపోవడం వల్ల తన అత్యున్నత పదవిని వదులుకోవాల్సి రావడం పాలనా వ్యవస్థలోని లోపాలకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల నుంచి కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version