Pakistan : ముజాహిదీన్లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐకమత్యం కీలకమని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ఇంటిని చక్కదిద్దుకోవడం చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2010 నుంచి 2017 మధ్య పాకిస్థాన్లో జరిగిన ఉగ్రవాద దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం పెషావర్ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా మరణించిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మసీదు సెంట్రల్ హాల్లో ప్రార్ధనలు జరుగుతుండగా తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడటాన్ని ఆయన హేయమైన చర్యగా పేర్కొన్నారు.
Read Also: Shocking Incident : ఛీ వీళ్లు పేరెంట్సా.. బిడ్డకు విమాన టిక్కెట్ కొనాల్సి వస్తుందని..
మసీదులో ప్రార్థనల్లో మునిగి ఉన్న వాళ్లను హతమార్చిన ఘటనలు భారత్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఎన్నడూ చోటుచేసుకోలేదని, కానీ ఇప్పుడు పాకిస్థాన్లో అలాంటి ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్కు ఇప్పటి వరకు సుమారు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించిందని వాపోయారు. మసీదులో ఆత్మాహుతి దాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్లో నిరసన ప్రదర్శన జరిపారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 101 మంది మరణించారు. వారిలో 97 మంది పోలీసులే. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీం మునీర్ సోమవారం పెషావర్ వెళ్లి పేలుడు స్థలాన్ని పరిశీలించారు.