ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై స్పందిస్తూ.. నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విడుదల చేసి.. ఆ వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు.
కాఫీ తాగుతూ కౌంటర్..
నెతన్యాహు ఒక కేఫ్ వద్ద కాఫీ ఆర్డర్ చేస్తూ వీడియోలో కనిపించారు. ‘నేను చనిపోయాను… కాఫీ కోసం’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ‘నా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇస్తున్నాను, వారి ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అని ఆయన అన్నారు.
Also Read:Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఈగల్ టీం కీలక ప్రకటన..
ఇదిగో ఐదు వేళ్లు..
కొన్ని రోజుల క్రితం నెతన్యాహు ప్రెస్ మీట్లో పాల్గొన్న వీడియోను ఎవరో మార్ఫింగ్ చేసి.. ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని.. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో చేసిన వీడియో అని ప్రచారం చేశారు. దీనికి సమాధానంగా.. నెతన్యాహు తన రెండు చేతులను కెమెరా వైపు చూపిస్తూ.. ‘నా చేతి వేళ్లను లెక్కపెట్టాలనుకుంటున్నారా..? ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ… చూశారా? అన్నీ బాగానే ఉన్నాయి’ అని నవ్వుతూ చెప్పారు.
ప్రజలకు భరోసా..
ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బయటకు వెళ్లండి కానీ ఎప్పుడూ సురక్షిత ప్రాంతాలకు దగ్గరలోనే ఉండండి. మీ ధైర్యం నాకు, ప్రభుత్వానికి, సైన్యానికి, మోసాద్ సంస్థకు ఎంతో బలాన్ని ఇస్తోంది. మేము ఇరాన్పై చాలా గట్టిగా దాడులు చేస్తున్నాం. మీరు ధైర్యంగా ముందుకు సాగండి, నేను కూడా మీతోనే ఉంటాను అని భరోసానిచ్చారు. అలాగే.. స్థానిక అధికారులు ఇచ్చే భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని ఆయన కోరారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై 16 రోజులు దాటింది. గత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 2,000 మందికి పైగా మరణించారని.. వారిలో ఎక్కువ మంది ఇరాన్కు చెందినవారేనని సమాచారం. అమెరికా కూడా తన సైనిక బలగాలను ఆ ప్రాంతానికి పంపి.. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తోంది.
