హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని అధికారులు స్పష్టం చేశారు. గుజరాత్లో తలెత్తిన కొన్ని తాత్కాలిక ఇబ్బందులను సాకుగా చూపి, స్థానికంగా కొరత ఉందనే అపోహలను సృష్టించడం వల్ల ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అసలేం జరుగుతోందంటే.. గత కొద్దిరోజులుగా గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ సరఫరాలో అంతరాయం కలిగిందనే వార్తలు వచ్చాయి. దీనిని ఆధారం చేసుకుని, హైదరాబాద్లో కూడా ఇంధన కొరత రాబోతోందని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మొదలయ్యాయి. ఈ వార్తలను నమ్మిన వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దీనివల్ల సాధారణం కంటే 3 రెట్లు ఎక్కువ డిమాండ్ పెరిగి, కొన్ని బంకుల్లో స్టాక్ త్వరగా ఖాళీ అవ్వడంతో ‘కృత్రిమ కొరత’ ఏర్పడింది.
ఈ పరిస్థితిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ , హైదరాబాద్ కలెక్టర్ హరిచందన స్పందించారు. నగర పరిధిలోని 186 పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని వారు తెలిపారు. బంకులకు కావాల్సిన అంత ఇంధన సరఫరా నిరంతరాయంగా జరుగుతోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. చమురు సంస్థలైన HPCL, IOCL, BPCL నుంచి సరఫరా గొలుసు (Supply Chain) సజావుగా సాగుతోంది. కాబట్టి.. ముందస్తుగా నిల్వ చేసుకోవడం వల్ల అనవసర రద్దీతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Also Read:Kavitha Party: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. మార్చి 27న ప్రకటన..
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై నిఘా పెట్టామని, అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేసే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. పెట్రోల్ బంకుల వద్ద అనవసరంగా గుమిగూడకుండా.. సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనాన్ని తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
