India vs Malaysia: హైదరాబాద్‌లో ఫిఫా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. మలేసియాతో భారత్ ఢీ!

  • అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం
  • గచ్చిబౌలిలో మైదానంలో భారత్ vs మలేసియా
  • జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం
India Vs Malaysia

India Vs Malaysia

గత సెప్టెంబర్‌లో ఇంటర్‌కాంటినెంటల్‌ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌.. మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి మైదానంలో భారత్, మలేసియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఇప్పటికే పూర్తిచేసింది. తొలిసారి హైదరాబాద్‌ వేదికగా ఫిఫా మ్యాచ్ జరుగుతుండడంతో ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. రాత్రి 7:30 నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఈ ఏడాదిలో 10 మ్యాచ్‌లు ఆడిన భారత్ 4 డ్రాలు, 6 ఓటములను ఎదుర్కొంది. 2024లో ఒక్క విజయం సాధించని భారత్.. మలేసియాపై గెలవాలని చూస్తోంది. ఈ ఏడాది భారత జట్టుకు ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో విజయం సాధించి.. వచ్చే ఏడాది మార్చిలో ఆరంభమయ్యే 2027 ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌కు సిద్ధమవ్వాలని చూస్తోంది. గాయం కారణంగా దాదాపు 10 నెలలు దూరంగా ఉన్న సెంట్రల్‌ డిఫెండర్‌ సందేశ్‌ జట్టుతో చేరుతున్నాడు. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 125వ స్థానంలో ఉండగా.. మలేసియా 133వ స్థానంలో ఉంది.

Also Read: Nitish Reddy Debut: పెర్త్‌ టెస్ట్.. తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి టెస్టు అరంగేట్రం ఖాయమే!

భారత ఫుట్‌బాల్‌ జట్టు ఇప్పటివరకు అత్యధిక సార్లు తలపడిన జట్టు మలేసియానే కావడం విశేషం. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగగా.. చెరో 12 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఎనిమిది మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు, సందేశ్‌ జింగాన్, మెహతాబ్, విశాల్, రోషన్‌ సింగ్, అమరిందర్‌ సింగ్, సురేశ్‌ సింగ్‌లు భారత జట్టుకు కీలకం కానున్నారు. విదేశీ ఆటగాళ్లను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడంతో మలేసియా టీమ్.. భారత్ కంటే బలంగా ఉంది. నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.