హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన తొలి ‘టీజీ20 క్రికెట్ లీగ్’ ఆటగాళ్ల వేలం ప్రక్రియ నేడు రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా ముగిసింది. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రికెటర్ల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జరిగిన ఈ ఆక్షన్లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రామోజీ గ్రూప్)కు చెందిన ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫ్రాంచైజీ మొత్తం రూ.58.95 లక్షలు వెచ్చించి, లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ 20 మందితో కూడిన ఒక జట్టును ఎంపిక చేసుకుంది. జూన్ 21 నుంచి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్ కోసం ఈ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాల్లోకి వెళ్తే.. జట్టులో అత్యధిక ధర పలికిన ఆల్రౌండర్ అజయ్దేవ్ గౌడ్కు రూ.11 లక్షలు, అలాగే టాప్ ఆర్డర్ బ్యాటర్ అభిరత్ రెడ్డి మందాడికి రూ.11 లక్షలు వెచ్చించారు. వీరితో పాటు మిడిల్ ఆర్డర్ బలోపేతం కోసం ప్రణవ్ వర్మను రూ.8.5 లక్షలకు, సాయి వికాస్ రెడ్డిని రూ.4.25 లక్షలకు, అన్విత్ రెడ్డిని రూ.3.5 లక్షలకు మేనేజ్మెంట్ దక్కించుకుంది.
ఇక మిగిలిన జట్టు సభ్యులలో గణేశ్ గడుగు (రూ.3.25 లక్షలు), యశ్వీర్ గౌడ్ (రూ.3 లక్షలు), శ్రీనికేత్ (రూ.2.3 లక్షలు), అఖిల్ రాథోడ్ (రూ.1.6 లక్షలు), తరుణ్ రాజన్ (రూ.1.6 లక్షలు), షణ్ముఖ రాజన్ (రూ.1.5 లక్షలు), పి.అరవింద్ (రూ.లక్ష), సి అభినవ్ తేజ్ (రూ.లక్ష), ప్రేమ్ చరణ్ (రూ.95 వేలు) ఉన్నారు. అలాగే యువ ఆటగాళ్లయిన గుడెల్లి జశ్వంత్, వైష్ణవ్ రెడ్డి, నితిన్ నాయక్, ఎంఎం చరణ్, దేవ్ మెహతా, మరియు మిర్యాల ప్రత్యూష్కుమార్లను తలా రూ.75 వేల చొప్పున వెచ్చించి జట్టులోకి తీసుకున్నారు. భారత్ అండర్-19 , దేశవాళీ మ్యాచ్ల అనుభవమున్న సీనియర్లతో పాటు లోకల్ యంగ్ టాలెంట్తో ఈ జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది.

