Site icon NTV Telugu

Hyderabad: 120 గజాల స్థలం కోసం.. అక్క అని కూడా చూడలేదు.. దారుణం..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని ఓ ప్రముఖ వ్యక్తి ఏనాడో చెప్పారు. నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే.. అది నిజమేనేమోనని అనిపిస్తోంది. తుచ్ఛమైన డబ్బు, ఆస్తుల కోసం సొంత వారు అని కూడా చూడకుండా అత్యంత కఠినాత్ములుగా వ్యవహరిస్తున్నారు కొంత మంది వ్యక్తులు. ఏ బంధాలు అవసరం లేదు.. డబ్బులు మాత్రమే కావాలనే విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అక్కను చంపేస్తే ఆస్తి దక్కించుకోవచ్చన్న నీచపు బుద్ధితో ఓ తమ్ముడు చేసిన దుర్మార్గమైన పని.. ఇప్పుడు మానవీయ సంబంధాలపై చర్చనీయాంశంగా మారింది. సొంత అక్కను అత్యంత దారుణంగా చంపేయడమే కాకుండా డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఇంతకీ ఆ కంత్రీ తమ్ముడు ఎవరు? ఈ కేసులో అసలేం జరిగింది?

ఈ ఘటన హైదరాబాద్‌ శివారులోని బాటసింగారంలో జరిగింది. రక్తం పంచుకు పుట్టిన అక్క అని కూడా చూడకుండా తమ్ముడు క్రూరంగా వ్యవహరించాడు. అక్కను అంతమొందించి ఘాతుకానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆమెపై నిందలు మోపాడు. ఆమె కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల లీలాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎల్‌బీ నగర్ ప్రాంతంలో నివసించేది. జీవనోపాధి కోసం వారు కిరాణా షాప్ నిర్వహించారు. అయితే కొన్నేళ్ల క్రితం సోదరుడు పప్పురాంతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బాటసింగారంలో 120 గజాల స్థలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. లీలాదేవికి తొమ్మిదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమెకి కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఆస్తి కోసం సొంత అక్కని దారుణంగా హత్య చేసాడు తమ్ముడు పప్పురామ్. కేవలం 120 గజాల స్థలం కోసం అక్కను ముక్కలు ముక్కలు చేసి క్రూరంగా హత్య చేశాడు.

ఫిబ్రవరి 28న లీలాదేవిని పప్పు రామ్ హత్య చేసి బాత్రూంలో పెట్టి లాక్ వేశాడు. ఆ తర్వాత తనకు ఏం తెలియనట్టు డ్రామా ఆడాడు. అంతే కాదు.. అక్క లీలా దేవి కూతురు, కొడుకును తీసుకుని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ పప్పు రామ్‌ను బంధువులు నిలదీయడంతో అక్క లీలాదేవి మిస్సయింది అని చెప్పాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చి మార్చి 8న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ కట్ చేస్తే.. కేసులో ఎలాంటి క్లూ పోలీసులకు దొరకలేదు. ఐతే పప్పు రామ్ కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు… తమదైన శైలిలో విచారించగా హత్యోదంతం బయటికి వచ్చింది.

ఫిబ్రవరి 28న పక్కా ప్లాన్ ప్రకారమే లీలాదేవిని తమ్ముడు పప్పు రామ్ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. పప్పు రామ్‌కు మరో ఇద్దరు సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశారు. అనంతరం డెడ్ బాడీ ముక్కలను కియా కారులో బాటసింగారంలో మజీద్‌పూర్ పెద్ద చెరువుకు తరలించారు. ఆయా బాడీ పార్టులను బ్యాగులో పెట్టి చెరువులో పడేశారు. కాళ్లను ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెరువులో వేశారు.

హత్యకు ప్రధాన కారణం ఆస్తి వివాదాలేనని పప్పురాం పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. లీలాదేవీ వద్ద బంగారం నగలు, డబ్బు ఉంది. బాటసింగారం గ్రామంలో 120 గజాల స్థలాన్ని అక్కా తమ్ముడు కలిసి కొనుగోలు చేశారు. లీలాదేవి.. తమ్ముడిని తన వాటా అడగడంతో వివాదం తలెత్తింది. దీంతో అక్కను చంపేస్తే వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదని దారుణానికి ఒడిగట్టాడు. పప్పు రామ్‌కు సాయం చేసిన రాజేష్ కుమార్, సునీల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కను చంపేస్తే.. హంతకుడవుతాడు.. కానీ ఆస్తికి యజమాని ఎలా అవుతాడు.. ఇంత చిన్న లాజిక్ ఆ తమ్ముడు ఎలా మిస్సయాడు.. అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. సొంత అక్కను కడతేర్చిన అతన్ని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version