Hydera Commissioner Ranganath Faces Contempt Case: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఈరోజు కోర్టు ముందు హాజరు కానున్నారు. పలు కంటెంప్ట్ పిటిషన్లలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇటీవల కోర్టు ఆదేశించింది. నవంబర్ 27 న జరిగిన విచారణలోనే హాజరు కావాలని రంగనాథ్ను ఆదేశించింది. అయితే ఆబ్సెంట్ పిటిషన్ వేయటంపై గత విచారణలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.
అసలు ఏం జరిగింది..?
ఇటీవల.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో కఠిన హెచ్చరిక జారీ చేసింది. బతుకమ్మ కుంట వివాదానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు డిసెంబర్ 5వ తేదీలోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ వివాదం హైదరాబాద్లోని బతుకమ్మ కుంట పరిధిలో కోర్టు వివాదంలో ఉన్న ఒక ప్రైవేట్ స్థలానికి సంబంధించింది. ఆ స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని.. యథాతథస్థితి కొనసాగించాలని కోర్టు గతంలో జూన్ 12వ తేదీన స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కోర్టు ఉత్తర్వులను కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏ. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని రంగనాథ్కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల.. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా రంగనాథ్ హాజరు కాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 5వ తేదీలోపు ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన కోర్టుకు హాజరుకానున్నారు.