Human Trafficking: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. అమాయక గిరిజన యువతులను లక్ష్యంగా చేసుకున్న అంతరాష్ట్ర ముఠా, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్న దారుణం బయటపడింది. తాజాగా బెజ్జూర్ మండలంకు చెందిన ఇద్దరు గిరిజన యువతులను మధ్యప్రదేశ్కు అక్రమంగా విక్రయించిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఈ యువతులను టార్గెట్ గా చేసుకుని ముఠా సభ్యులు మోసం చేసినట్లు విచారణలో తేలింది.
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే జూన్ నెల దర్శన కోటా టికెట్ల విడుదల..
ఈ కేసులో చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన ప్రశాంత్, సవిత దంపతులు, అలాగే సిరోంచాకు చెందిన మహేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రాహుల్ పరారీలో ఉన్నాడు. ఒక్కో యువతిని రూ.2.50 లక్షలకు విక్రయించి, డబ్బులను నలుగురు సభ్యులు పంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది జూన్లో ఈ యువతులు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్లో అదృశ్యం కేసు నమోదు కాగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితులను రక్షించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం తప్ప జీవనాధారం లేని పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ.. “ఉద్యోగం, మంచి జీవితం, పెళ్లి” అంటూ మోసగిస్తున్న ఈ ముఠాలు గిరిజన మహిళలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నాయి. మైనర్ బాలికలు, వివాహితులు, ఒంటరి మహిళల కోసం వేర్వేరు రేట్లు నిర్ణయించి అక్రమ రవాణా కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదే జిల్లాలో గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. కొన్ని ముఠాలు మహిళలను మధ్యప్రదేశ్ కు తరలించి వ్యభిచారంలోకి నెట్టిన ఘటనలు బయటపడ్డాయి. పోలీసులు ఈ ముఠా కార్యకలాపాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
