Site icon NTV Telugu

Online Gaming Froud: హైదరాబాద్ లో ఆన్‌లైన్ గేమింగ్ మాఫియా గుట్టురట్టు.. ఏకంగా రూ.13,000 కోట్ల మోసం

Online Gaming

Online Gaming

ఆన్‌లైన్ గేమింగ్ అక్రమ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం (డీజీజీఐ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సంస్థ ప్రధానంగా మోసాల గుర్తింపు, కస్టమర్ వెరిఫికేషన్, డిజిటల్ కేవైసీ సేవలను అందిస్తున్నట్లు గుర్తించారు.

Also Read:BMW CE 02: బీఎండబ్య్లూ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ. 2 లక్షల డిస్కౌంట్.. రిలీజైన ఏడాదిన్నరకే ఎందుకిలా?

దర్యాప్తులో సేకరించిన ఆధారాల ప్రకారం సుమారు రూ.13,000 కోట్ల విలువైన ఒక పెద్ద సంఘటిత ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ నెట్‌వర్క్‌కు అనుబంధంగా పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేలు, మూడో పార్టీ టెక్నాలజీ సేవా సంస్థలు సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల తరఫున వ్యాపారులకు, షెల్ కంపెనీలకు మోసపూరిత కేవైసీ ధృవీకరణలు చేయడంలో పంకజ్ కుమార్ కీలక పాత్ర పోషించినట్లు డీజీజీఐ వెల్లడించింది.

కేవైసీ ప్రక్రియ నిర్వహించే సంస్థ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ, వినియోగదారుల యాజమాన్యం, నియంత్రణ నిర్మాణాల ఆధారంగా రిస్క్ ప్రొఫైలింగ్ చేయడంలో విఫలమయ్యారని దర్యాప్తులో తేలింది. యూపీఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ సంస్థలను ఆన్‌బోర్డ్ చేయడంలో ఆయన సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బు ప్రవాహానికి వీలు కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ ఆదాయంలో ఆయన కూడా లబ్ధిదారుడిగా ఉన్నట్లు వెల్లడించారు.

Also Read:Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..

2025 సంవత్సరానికి భారతదేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ మొత్తం విలువ సుమారు 23 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రెండు లక్షల కోట్లు)గా అంచనా. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్లపై డీజీజీఐ హైదరాబాద్ విభాగం భారీ స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. అనుబంధ ఫిన్‌టెక్ సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు సుమారు రూ.100 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, కీలక మాస్టర్‌మైండ్‌లను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version