NTV Telugu Site icon

Srisailam Project: శ్రీశైలం డ్యామ్‌కు పోటెత్తిన వరద.. ఇక గేట్లు ఎత్తుడే మిగిలింది..!

Srisailam

Srisailam

Srisailam Project: శ్రీశైలం డ్యామ్‌ క్రమంగా వరద పోటెత్తుతోంది.. ఓవైపు కృష్ణా రివర్‌.. మరోవైపు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతోంది.. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది.. తుంగభద్ర జలాశయంలో 28 గేట్ల ద్వారా లక్ష 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, సుంకేసుల జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.. ఇక, తుంగభద్ర నుంచి నీటి విడుదల లక్షా 50 వేలకు పెంచే అవకాశం కూడా ఉంది.. జూరాల నుంచి ఇప్పటికే 2 లక్షల 51 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.. ఇలా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు 3 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది..

Read Also: Hero Vishal: సినిమాలు చేస్తూనే ఉంటా.. దమ్ముంటే ఆపుకోండి! ఫిల్మ్ చాంబర్‌కి విశాల్ సవాల్

రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.. రాబోయే 15 రోజుల్లో కృష్ణ బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 864.4 అడుగులకు చేరుకుంది.. నీటినిలువ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 118.5 టీఎంసీలుగా ఉంది.. ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో.. సోమ లేదా మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు.. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అంటూ ప్రకృతి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు.. గేట్లు ఎత్తే సమయంలో.. పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి పర్యాటకులు పోటెత్తే విషయం విదితమే.