హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో రూ. 142 కోట్ల నగదు సీజ్ అయింది. అలాగే… రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు అధికారులు. 6 రాష్ట్రాల్లో 4 రోజులపాటు 60 చోట్ల హెటిరో సంస్ధల్లో ఐటీ దాడులు జరిగాయి. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టారని.. బీరువాల్లో రూ. 500 నోట్ల కట్టలేనని ఐటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలను సీజ్ చేసిన అధికారులు.. చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ. 142 కోట్లు దాచారని ఐటీ అధికారులు గుర్తించారు. ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని.. ఒక్కో అల్మారాలో 5 కోట్ల నగదు దాచారని ఐటీ శాఖ వెల్లడించింది. డబ్బు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందని.. పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు.