Himanta Biswa Sarma: భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నేత హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (Lakshman Prasad Acharya) ఉదయం 11.40 గంటలకు ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేయించనున్నారు. ఆయనతో పాటు నలుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఇద్దరు బీజేపీ నేతలు కాగా.. అసోం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
అస్సాంలో ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం కాగా, హిమంత బిస్వా శర్మ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అస్సాంలో వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేస్తున్న తొలి కాంగ్రెసేతర నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల్లో మాజీ కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి ఒకరు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దులియాజన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా బోకాఖాట్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. గత ప్రభుత్వాల్లో వ్యవసాయం, పశుసంవర్ధక, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించారు.
అలాగే బీపీఎఫ్ ఎమ్మెల్యే చరణ్ బోరో కూడా మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మజ్బత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇప్పటికే కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. మరోవైపు అస్సాం తొలి మహిళా ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందిన అజంతా నియోగ్ కూడా మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అస్సాం అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత రంజీత్ కుమార్ దాస్ పేరును ఎన్డీఏ ప్రకటించింది. 2016లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఆయన స్పీకర్గా పనిచేశారు.
ఖానాపారా వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. మిజోరం ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి రెండు మూడవ వంతు మెజార్టీ సాధించింది. బీజేపీ 82 స్థానాలు గెలుచుకోగా, ఏజీపీ & బీపీఎఫ్ చెరో 10 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
