Assam CM Himanta Biswa Sarma: అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ నేడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఘన విజయం అందించడంతో మరోసారి రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏర్పడింది. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి, భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వ శర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. 57 ఏళ్ల హిమంత శర్మ అస్సాంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా చరిత్ర సృష్టించారు. మే 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ ఒంటరిగా 82 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) చెరో 10 సీట్లు గెలవడంతో NDA మొత్తం బలం 102కు చేరింది. ఈ ఎన్నికల్లో జలుక్బారి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హిమంత బిశ్వ శర్మ 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
హిమంత శర్మతో పాటు బీజేపీ నేతలు రామేశ్వర్ తేలీ, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు హిమంత శర్మ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నా సహచరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు” అని తెలిపారు. అదేవిధంగా సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే రంజిత్ దాస్ను అస్సాం అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది.
అస్సాంలో NDA ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం విశేషం. 2016లో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నాయకత్వంలో మొదటిసారి NDA ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గువాహటిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు నగరమంతా భారీ బందోబస్తు నిర్వహించాయి.
