NTV Telugu Site icon

Heavy Floods: ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి.. గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం

Rains

Rains

Heavy Floods: ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యదిశగా కదులుతూ రాగల 12 గంటలలో ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా మారడంతో మత్స్య కారుల వేటపై నిషేధం కొనసాగుతోంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. వీధుల్లోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది.

ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి
మరోవైపు విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ప్రకాశం బ్యారేజీకి 13,634 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ 17 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 12,325 క్యూసెక్కుల నీటిన విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా మరో 1,309క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. భారీ వర్షాల కారణంగా గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుకు… ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరింది. ఎనిమిదిన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ప్రకాశం బ్యారేజీని ముంచెత్తుతున్నాయి.

Read Also: Godavari Floods: గోదావరికి శబరిపోటు.. ప్రమాద హెచ్చరికలు జారీ

చిగురుటాకులా వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరదలు తోడు కావడంతో ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. ఖమ్మం జిల్లా పెదవాగు గండి ప్రభావంతో వరద బారిన పడిన వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలు ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి బయటపడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో కొండవాగులు ఉప్పొంగి రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి .గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగడంతో బుట్టాయిగూడెం మండలం కామవరం అడివి ప్రాంతంలో గల గుబ్బల మంగమ్మ గుడి ఆలయానికి భక్తులు రావద్దని పోలీసు హెచ్చరిక జారీ చేశారు.వర్షాలు తగ్గేవరకు ఆలయానికి భక్తులు రావద్దని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్రకాల్వ జలాశయానికి నిలకడగా వరద కొనసాగుతోంది. జలాశయం పూర్తి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 81.06 మీటర్ల వద్ద వరద కొనసాగుతోంది.ప్రాజెక్ట్ లో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 7600 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 10200 క్యూసెక్కులుగా ఉంది. నాలుగు గేట్లు ఎత్తి 10200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో నరసాపురం -సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలను నిలిపివేశారు. ఎర్ర కాలువ ఉధృతితో వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో భీమవరంలోని యనమదుర్రు డ్రైన్ ప్రమాదకరంగా మారింది..ఎర్ర కాలువ నుండి నీరు వదలడంతో యనమదుర్రు డ్రెయిన్ లో32 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ఇరిగేషన్ అధికారులు.. రెండవ ప్రమాదక హెచ్చరికను జారీ చేసారు.

వరద ఉధృతికి ధ్వంసమైపోతున్న లంకభూములు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వరద ప్రభావానికి కోతకు గురై లంక భూములు గోదావరి నదిపాయలో కలిసిపోతున్నాయి. ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనాలంక, కమిని, పొట్టిలంక, కొత్తలంక, వలసలతిప్ప ప్రాంతాలలో వరద ఉధృతికి విలువైన లంక భూములు ధ్వంసమైపోతున్నాయి. గత సంవత్సరం వరదల సమయంలో శాశ్వత పరిష్కారంగా గోదావరికి రెండువైపులా రివిట్ మెంటు కొరకు నూటయాభై కోట్ల రూపాయలను మంజూరుచేసినా పనులు కార్యరూపం దాల్చలేదు. సాగు భూములు కళ్ళ ముందే కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే వరద ఉధృతి మరింత పెరుగుతుంది. గ్రామాలలో ఇళ్లల్లోకి కూడా నీళ్లు వస్తుంటాయి. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా లంక గ్రామాలకు మరపడవలు కేటాయించారు అధికారులు. లంక గ్రామాలైన‌ గురజాపులంక, కూనాలంక, కమిని ప్రాంతాలకు వరద ప్రభావంతో రోడ్డు నీట మునిగి రాకపోకలు స్ధంభించాయి..రాకపోకలకు మరపడవలను కేటాయించారు .. ప్రతి ఏడాది వరదల సమయంలో మర పడవలపై రాకపోకలు సాగించడం తప్ప శాశ్వత పరిష్కారాలు దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం లేదని లంక గ్రామాల ప్రజలు అంటున్నారు