అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన కొన్ని భయానక ఫొటోలను ఇప్పుడు చూద్దాం..
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురికావడంలో అసలేం జరిగిందన్న విషయం సమగ్ర విచారణ తర్వాతే తేలుతుంది.
అయితే టేకాఫ్ తర్వాత కొద్ది క్షణాలు విమానయాన రంగంలో ఎంతో కీలకమైనవి. ఈ సమయంలో జరిగే ప్రమాదాలను ఛేదించడం సవాలుతో కూడుకున్న విషయం.

భారత నిపుణులు అమెరికా, బ్రిటన్ నిపుణులతో కలిసి ప్రమాదానికి కారణాలపై రానున్న రోజుల్లో దర్యాప్తు చేయబోతున్నారు.
బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేకు కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే కూలిపోయింది. దీనికిగల కారణాలపై దర్యాప్తు జరగనుంది.
2011లో కమర్షియల్ సర్వీసుల్లోకి అడుగుపెట్టిన తర్వాత 787-8 డ్రీమ్లైనర్కు చెందిన విమానానికి ఇంత తీవ్ర ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 241మంది చనిపోయారు. మరికొందరు స్థానికులు మరణించారు.
టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోవడానికి కారణాలేంటి అనేదానిపై భారత్లోని విమానయాన రంగ నిపుణులు, పైలట్లతో బీబీసీ మాట్లాడింది.
వారిలో కొందరు తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు. వారు భారత్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి తరచుగా బోయింగ్ 787-8 మోడల్ విమానాలను నడుపుతుంటారు.
ప్రమాదానికి గురైన 787-8 డ్రీమ్లైనర్ను కెప్టెన్ సుమీత్ సభర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్లు నడుపుతున్నారు. వారిద్దరికీ విమానం నడపడంలో చాలా అనుభవం ఉంది. ఇద్దరూ కలిసి 9,000 గంటలపాటు విమానం నడిపారు. కమర్షియల్ ఎయిర్లైన్ పైలట్గా సభర్వాల్కు 22 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
242 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 1.39గంటలకు విమానం టేకాఫ్ అయిందని ఎయిర్ ఇండియా చెప్పింది
బయలుదేరేటప్పుడు విమానంలో వంద టన్నుల ఇంధనం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. విమానం సామర్థ్యానికి తగ్గట్టుగా అందులో ఇంధనం ఉంది.