Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..

Harman

Harman

ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి అనంతరం భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన ఆవేదనను, జట్టు వైఫల్యాలను బాహాటంగా పంచుకున్నారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో, పెద్ద జట్లతో ఆడేటప్పుడు జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండటం లేదని ఆమె అంగీకరించారు.

హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. “చివర్లో మేము బోర్డుపై ఒక మంచి స్కోరునే ఉంచగలిగాం. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొంత స్కోరు తక్కువవుతుందేమోనని భావించాను, కానీ చివరి రెండు ఓవర్లలో మా బ్యాటర్లు మంచి స్కోరు అందించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ పరుగుల కోసం ప్రయత్నించినా, మధ్యలో వారిని కట్టడి చేయగలిగాం. కానీ, గత కొన్ని మ్యాచ్‌లుగా చివరి ఓవర్లలో (డెత్ ఓవర్స్) మేము విపరీతంగా పరుగులు ఇచ్చుకుంటున్నాం. ఒకవేళ మేము లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే, బ్యాటింగ్‌లో ఆ పరుగులను రాబట్టలేకపోతున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతోంది” అని పేర్కొన్నారు.

పెద్ద జట్లతో ఆడేటప్పుడు వ్యూహాలు మారాలి..
“ఈ టోర్నమెంట్‌ మొత్తాన్ని పరిశీలిస్తే, మేము పెద్ద జట్లపై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. సాధారణంగా బలమైన జట్లతో తలపడేటప్పుడు మన అత్యుత్తమ ఆట బయటకు రావాలి. కానీ మేము మా సొంత ప్రమాణాలకు తగ్గట్టుగా ఆడలేదు. ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్లలో ఒకటి, వారు వారి ప్రణాళికల ప్రకారమే బౌలింగ్ చేశారు. మేము వికెట్లు పెద్దగా కోల్పోకపోయినా, ఆశించిన రన్ రేట్ సాధించలేకపోయాం. క్యాచ్‌లు వదిలేయడం కూడా మాకు నష్టం చేసింది. ఒక జట్టుగా మేము చాలా విషయాల గురించి పునరాలోచించుకోవాలి. పెద్ద జట్లను ఎలా ఎదుర్కోవాలో, మా వ్యూహాలను ఎలా మార్చుకోవాలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది” అని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేశారు.