Site icon NTV Telugu

Harish Rao: దళిత నాయకుడు బాల్క సుమన్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం..

Harish Rao

Harish Rao

Harish Rao: క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. క్యాతన్ పల్లిలో బీఆర్ఎస్‌కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నదన్నారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్టకు చేరిందని వెల్లడించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నదని పేర్కొన్నారు. హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో అని తెలిపారు.

READ MORE: Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!

“జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసింది. తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదు. రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనం. ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తున్నాం.” అని మాజీ మంత్రి హరీష్‌రావు పోస్ట్‌లో పేర్కొన్నారు.

READ MORE: AP Government: గుడ్‌న్యూస్‌.. 22 ఏ జాబితా నుంచి ఆ భూముల తొలగింపు..!

Exit mobile version