Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..

Harish Rao

Harish Rao

Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కూటి కోసం, కూలి కోసం వలస వచ్చి సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్న 54 మంది పేద కార్మికులు సజీవదహనమైన దుర్దినమని గుర్తు చేశారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యమన్నారు. సిగాచి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక కార్మికులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ హృదయవిధారక ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందని.. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మాత్రం కరగలేదన్నారు. దుర్ఘటన జరిగిన రోజు హైదరాబాద్ లోని తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లోనే ఉన్నడు కానీ, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగాచి పరిశ్రమ వద్దకు మాత్రం రాలేదు. బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవలేదని ఆరోపించారు. విమర్శల నేపథ్యంలో తెల్లారి ఘటన వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి మృతదేహాల సాక్షిగా ప్రతి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇస్తామని ఘనంగా ప్రకటించారని.. కోటి ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వం తరుపున ఇచ్చింది ఎంత అంటే కేవలం లక్ష రూపాయలన్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్యల ఏమైనా ఉంటదా?తలదించుకోవాలని విమర్శించారు. కంపెనీ ఇచ్చిన డబ్బులు బాధిత కుటుంబాలకు ముట్టజెప్పి, కోటి పరిహారం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని పరిహారంలో చూపడం శోచనీయమని మండిపడ్డారు.

అవేదో కంపెనీ జేబులోంచి ఇస్తున్న పరిహారం కాదు, కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బ అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. “ఆ డబ్బులను కూడా తీసుకువచ్చి కంపెనీ ఇచ్చే పరిహారంలో కలిపి చూపించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్య అమానవీయతకు, దిగజారుడుతనానికి పరాకాష్ట. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే కోత విధించారు. క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందక, జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాధిత కుటుంబాలకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటికీ దిక్కులేదు. కార్మిక శాఖ బాధ్యత రాహిత్యానికి అమాయక వలస బతుకులు వేదన చెందుతున్నాయి. ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో ఆధారాలతో సహా స్పష్టంగా తేలింది. 818 హెచ్‌పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని, అక్రమంగా 1777 హెచ్‌పీకి యంత్రాలను పెంచేశారు. సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదు. ఇంత నిర్లక్ష్యం బయటపడినా, ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బాధితుల పక్షాన హైకోర్టులో కేసు వేసి, న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు కదలలేదు. తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయడం, వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే.. ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూనే ఉంది. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలి. వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు భేషరతుగా కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బతికున్న ప్రజలను మోసం చేయడం, మాట తప్పడం మీకు ఎలాగూ అలవాటే. కానీ కనీసం ఆ ప్రాణాలు కోల్పోయిన పేద కార్మికులను, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కుటుంబాలను మోసం చేయకండి. రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పినవు, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి తప్పనవు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాటను కూడా తప్పినవు. మాట మీద నిలబడే అలవాటు లేదా రేవంత్ రెడ్డి. నోరు తెరిస్తే అబద్దాలేనా? ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన లేదా? మీరు ఆనాడు మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం, పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేకపోతే ఈ బాధిత కుటుంబాల కన్నీళ్లు, ఆవేదన ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంటాడుతాయి.” అని హరీష్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.