Harish Rao: హైడ్రాలో డ్రైవర్ పోస్టుల భర్తీ సందర్భంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వద్ద జరిగిన ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారని.. ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని నిలదీశారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని.. ఇది నిరుద్యోగుల తప్పా? లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన మీ ప్రభుత్వం తప్పా? అని ప్రశ్నించారు.
ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి స్థాయిలో “క్రిమినల్ వేస్ట్” అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే “యథా రాజా.. తథా అధికారులు” అన్న సామెత గుర్తుకొస్తోందని హరీశ్ రావు అన్నారు. అధికారుల నోటివెంట ఇలాంటి మాటలు రావడం మరింత బాధాకరమని.. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని.. 32 నెలలు దాటింది, ఆ హామీ ఏమైందని అడిగారు. రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా? అని నిలదీశారు.
మీ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోందని.. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పిహెచ్డి వంటి ఉన్నత విద్య చదివిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని.. ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా విద్యార్థులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. “ఉద్యోగం అడగడం నేరం కాదు. ప్రశ్నించడం నేరం కాదు. ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదు. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలి. ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వారిని అవమానించినందుకు విద్యార్థి, నిరుద్యోగ లోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.” అని హరీశ్ రావు ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.

