NTV Telugu Site icon

Harish Rao : గణేష్‌ గడ్డ బీఆర్ఎస్‌కు కలిసి వచ్చిన అడ్డా..!

Harish Rao

Harish Rao

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్ రామి రెడ్డి, పటన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. గణేశ్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన అడ్డ అని ఆయన అన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్ లో ఎగురుతుందని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు లో గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో.. అంతగా తుస్సుమనిపించిందన్నారు. వందరోజుల్లో హమీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికీ ఎలాంటి హమీలు నెరవేరలేదని, ఇప్పటికే పేద మహిళలకు ఫించన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42లక్షల మందికి బాకీపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’ నిరుద్యోగ భృతి, పేద మహిళలకు ఫించన్లు ఇచ్చిన తరువాతే ఓట్లు ఆడగాలి. కౌలు రైతులకు, రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. అభయహస్తం అక్కరకు రాని హస్తమయ్యింది. కేసీఆర్ కిట్టు బందయ్యింది. తిట్లు మాత్రం మొదలైనయ్. రైతుల వద్దకు కేసీఆర్ పోయి పరామర్శిస్తే తట్టుకోలేక.. రేవంత్ రెడ్డి నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి భాష జుగుప్సా కరంగా ఉంది . నీవు రాష్ట్ర ముఖ్యమంత్రివా.. చెడ్డీ గ్యాంగ్ లీడర్‌వా.. కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మాయచేస్తున్నది. బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటూ దుష్ర్పచారం చేస్తున్నారు.ఆయన తెల్లాపూర్ లోనే ఉంటున్నారు. వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేస్తానన్న మంచి మనిషి వెంకట్రామిరెడ్డి. అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు ఓటేయాలి. పార్లమెంట్ లో మన సమస్యలపై గళం విప్పే వాళ్లు కావాలా.. గులాం గిరి చేసే వారు కావాలా ప్రజలు నిర్ణించుకోవాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.