NTV Telugu Site icon

Hardik Pandya: హార్దిక్ భారీ సిక్సర్‌కు ఫీల్డింగ్ చేసిన ఐసీసీ ఛైర్మెన్..

Hardik

Hardik

Hardik Pandya: టీమిండియా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరోమారు తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇది ఇలా ఉండగా.. మ్యాచ్ చివరిలో హార్దిక్ పాండ్యా తనదైన స్టయిల్‌లో సిక్సర్ల మోత మోగించాడు. అయితే ఆసక్తికరంగా, పాండ్యా కొట్టిన సిక్సర్లకు బంతి రాయల్ బాక్స్‌లో కూర్చొన్న ఐసీసీ ఛైర్మన్ జై షా దగ్గర పడింది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ఐసీసీ ఛైర్మన్ జై షా రాయల్ బాక్స్‌లో కూర్చొని టీమిండియా బ్యాటింగ్‌ను ఆస్వాదించారు. ఇక మ్యాచ్ చివర్లో విరాట్ కోహ్లి అవుట్ అయిన తర్వాత స్టేడియంలో ఒక్కసారిగా సైలెన్స్ నెలకొంది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా.. తనదైన మార్క్ బ్యాటింగ్ తో అలరించాడు. మొదట మరో వికెట్ పడకుండా స్లోగా ఆడుతున్న పాండ్యా, తన్వీర్ సంఘా వేసిన 45వ ఓవర్‌లో వరుసగా నాలుగు డాట్ బంతులు ఆడాడు. ఆ తర్వాత ఐదో బంతిని పాండ్యా స్ట్రయిట్‌గా గాల్లోకి లేపాడు. చివరకు ఆ బంతి సిక్స్ రూపంలో నేరుగా రాయల్ బాక్స్‌లో పడింది. అప్పటికే అక్కడ ఉన్న జై షా వెంటనే బంతిని అందుకుని గ్రౌండ్‌లోకి విసిరారు. దీనిపై నెటిజన్లు పాండ్యా టార్గెట్ జై షానే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 24 బంతులు ఆడి మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు సాధించాడు. అంటే, పాండ్యా చేసిన 24 పరుగుల్లో 22 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. పాండ్యా సిక్సర్లతో టీమిండియాకు మ్యాచ్ ఈజీగా మారిందని చెప్పవచ్చు. పాండ్యా అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్‌ని ముగించాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులు చేయగా, అలెక్స్ కారీ 61 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ ఇచ్చిన 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.1 ఓవర్లలో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లి 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42 పరుగులతో జట్టు విజయంలో సహకరించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పేస్ బౌలర్ నాథన్ ఎల్లీస్, స్పిన్నర్ ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు తీశారు.