భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ప్రతి యువ క్రికెటర్ కల. ఆ కలను నిజం చేసుకునేందుకు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయక కథే పంజాబ్కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బరార్ది. ఇటీవల అఫ్గానిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో ఎంపికైన 26 ఏళ్ల గుర్నూర్కు అరంగేట్రం చేసే అవకాశం రాకపోయినా, అతని ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఆరు అడుగుల ఐదు అంగుళాల ఎత్తున్న గుర్నూర్ బరార్ 17 ఏళ్ల వయసులోనే క్రికెట్ను సీరియస్గా ప్రారంభించాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల నిరంతర శ్రమ, అంకితభావం తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించాడు. అతని తండ్రి సుఖ్బీర్ సింగ్ బరార్ పంజాబ్ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. కుమారుడు క్రీడలపై ఆసక్తి చూపినప్పుడు తనకు ఎంతో సంతోషం కలిగిందని ఆయన తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో నిమగ్నమైతే చెడు అలవాట్లు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటాడనే నమ్మకం తనకు ఉండేదని చెప్పారు.
గుర్నూర్ మొదట బాస్కెట్బాల్ ఆడాలని తండ్రి ప్రోత్సహించినా, అతడికి ఆ ఆటపై ఆసక్తి కలగలేదు. తర్వాత క్రికెట్ వైపు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూడలేదు. చదువులోనూ రాణించిన గుర్నూర్కు స్పోర్ట్స్ కోటా ద్వారా డీఏవీ కాలేజీలో ప్రవేశం లభించింది. కాలేజీ జట్టుకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
అఫ్గానిస్థాన్ సిరీస్కు భారత జట్టులో ఎంపికైన వార్త తెలిసిన రోజు కుటుంబ సభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారని సుఖ్బీర్ తెలిపారు. అయితే గుర్నూర్ మాత్రం చాలా ప్రశాంతంగా స్పందించాడని చెప్పారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన తర్వాత తన తొలి కారును కూడా స్వంతంగా కొనుగోలు చేశాడు. 17 ఏళ్ల వయసులో ప్రారంభమైన ప్రయాణం 26 ఏళ్లకు టీమిండియా వరకు చేరడం వెనుక ఉన్న కృషి, పట్టుదల యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

