Pakistan: గల్ఫ్ దేశాలు తమకు మంచి మిత్రదేశాలు అని చెప్పుకుని తిరుగుతున్న పాకిస్తాన్కు ఆ దేశాలు షాక్ ఇస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వచ్చే పాకిస్తానీల వల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆ దేశాలు భావిస్తు్న్నాయి. మార్చి 1 నుంచి జూలై 13 మధ్య గల్ఫ్ దేశాల నుంచి 20,000 మందికి పైగా పాకిస్తానీలను డిపోర్ట్ (బహిష్కరించడం) చేశారు. గురువారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో వెల్లడించిన గణాంకాలతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్ నార్కోటిక్స్ కంట్రోల్ మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం.. గల్ఫ్ అధికారులు భద్రతా ఆందోళనలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు, క్రిమినల్ కేసులు వంటి కారణాలతో ఈ డిపోర్టేషన్లు చేపట్టినట్లు పేర్కొంది. ఇటీవల, పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియానే గరిష్టంగా 15,500 పాకిస్తానీలను డిపోర్ట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత యునైడెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) 3,803 మందిని బహిష్కరించింది. ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల్లో డిపోర్ట్ అయిన వారి సంఖ్య తక్కువగా ఉంది. ఒమన్ 1,606, బహ్రెయిన్ 521, ఖతార్ 429, కువైట్ 97 మంది పాకిస్థానీయులను వెనక్కి పంపాయి.
చట్ట విరుద్ధంగా ప్రవేశించడం, వీసా గడువు ముగిసినా దేశంలో ఉండటం, బిక్షాటన, డ్రగ్స్ సంబంధించిన నేరాలు, భద్రతా ఆందోళనలు, నకిలీ లేదా సరైన పత్రాలే లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల తమ ప్రజలు బహిష్కరణ ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిపోర్ట్ అయిన వారిలో 4628 మంది పరారైనవారు ఉన్నారని, జైలు శిక్ష అనుభవించిన మరో 1294 మందిని కూడా గల్ఫ్ దేశాలు పాకిస్తాన్కు తిప్పి పంపాయి. 968 మందిని బ్లాక్లిస్ట్ చేశారు. . 1,155 మంది పాకిస్థానీయులకు పాస్పోర్టులు పోయిన కేసులు ఉన్నాయి. మరో 689 మందిని వీసా ఉల్లంఘనల కారణంగా, 342 మందిని ప్రవేశం నిరాకరించిన కేసుల్లో డిపోర్ట్ చేశారు. మరో 6000 మందిని వివిధ కారణాలతో డిపోర్ట్ చేశారు.
ఇదే కాకుండా ఇరాన్ పై జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు, ఇతర కంటెంట్ తమ నగరాల్లో చిత్రీకరించడం లేదా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వంటి చర్యల కారణంగా కొంతమంది పాకిస్థానీయులను అదుపులోకి తీసుకుని, డిపోర్ట్ చేసిన కేసులను కూడా మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. ఈ కేసులు కేవలం ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘటనకు మాత్రమే కాకుండా భద్రతా పరమైన అంశాలు కూడా డిపోర్టేషన్లలో ఉన్నాయని తెలుస్తోంది.

