NTV Telugu Site icon

100 Websites Ban: కేటుగాళ్లకు చెక్‌..! వందకు పైగా వెబ్‌సైట్లపై నిషేధం

Ban

Ban

100 Websites Ban: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లు కొందరు. ఉన్న ఉద్యోగంతో వస్తున్న ఆదాయం చాలక పార్ట్‌టైమ్‌ పని కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు ఇంకొందరు. రోజూ ఆఫీసుకు వెళ్లే పరిస్థితిలోని చంటి పిల్లల తల్లులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు.. ఇలా ఇంటి వద్దే ఉండి విధులు నిర్వహించే ఉద్యోగాల కోసం చూస్తున్నారు మరికొందరు. మేం కష్టపడతాం.. తగిన ప్రతిఫలితం ఇవ్వండి చాలు అని చాలా న్యాయంగా అడిగే వాళ్లే వీళ్లంతా. కానీ, వీళ్ల అవసరాలను ఆసరాగా చేసుకుని నిలువునా దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. రిజిస్ట్రేషన్‌, డిపాజిట్‌ అంటూ రకరకాల కారణాలు చెబుతూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు సైబర్‌ దుండగులు. ముఖ్యంగా చైనాకు చెందిన వెబ్‌సైట్‌లు, పేమెంట్‌ గేట్‌వేలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు.

Read Also: Ayodhya Ram Mandir: రామమందిరం ప్రారంభోత్సవానికి ఆ స్టార్ క్రికెటర్లు..!

నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న వందకు పైగా వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వ నిషేధించింది. ఈ వెబ్‌సైట్‌లు డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, మ్యూల్, అద్దె ఖాతాలను ఉపయోగిస్తూ మోసాల‌కు చేస్తున్నట్టు గుర్తించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్లపై కేంద్ర ఐటీ శాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో మొబైల్‌ ఫోన్‌కు కాల్‌ చేయడం, SMSలు పంపడం, ఈ-మెయిల్‌కు నకిలీ ఆఫర్‌ లెటర్లు పంపడం ద్వారా యువకుల్ని ముగ్గులోకి లాగడంలో ఆరితేరిపోయారు పైబర్‌ కేటుగాళ్లు. వర్క్‌ఫ్రం హోం, పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ఇప్పిస్తామని అమాయకుల్ని నమ్మిస్తున్నారు. తర్వాత వాళ్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్న ముఠా ఏకంగా 712 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా రేట్‌ అండ్‌ రెవ్యూ పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరుతో మోసాలు చేసింది ఆ ముఠా. ఇక కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఓ బాధితుడి నుంచి ఏకంగా కోటి 20 లక్షల రూపాయలు వసూలు చేశారు సైబర్‌ దొంగలు.

Read Also: Telangana Elections: తెలంగాణలో జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు

బాధితుల నుంచి డబ్బు అందగానే.. క్షణాల్లో దానిని అనేక ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. తద్వారా దర్యాప్తు సంస్థలను తప్పుదోవపట్టించడంతో పాటు దర్యాప్తు ముందుకు సాగకుండా చూస్తున్నారు. తర్వాత ఆ డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మార్చుకుని సరిహద్దు దాటిస్తున్నారు. దీంతో బాధితుల నుంచి కాజేసి డబ్బును వసూలు చేయడం దర్యాప్తు సంస్థలకు అసాధ్యమవుతోంది. బాధితుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తుతుండడంతో మోసాలకు పాల్పడుతున్న వందకు పైగా వెబ్‌సైట్లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.